రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో బహిరంగ రహస్యమే. ఓవైపు సినిమాల బడ్జెట్లు పెరిగిపోతుంటే.. ఇంకోవైపు అనుకున్న మేర బిజినెస్ జరగట్లేదు. సినిమాల సక్సెస్ రేట్ కూడా పడిపోతోంది. ఈ నేపథ్యంలో పారితోషకాలు తీసుకోవడం కంటే లాభాల్లో వాటా తీసుకోవడం, లేదా కొన్ని ఏరియాల రైట్స్ తీసుకోవడం ఉభయతారకంగా ఉంటుందన్నది వారి అభిప్రాయం. 

దీని వల్ల సినిమా హిట్టయితే అందరికీ మంచి లాభాలు అందుతాయి. నష్టపోతే అందరి మీదా భారం పడుతుంది. దీని వల్ల ఎవరికీ అన్యాయం జరుగుతుందన్నది వారి వాదన. ముందే భారీగా పారితోషకం తీసుకుని.. నిర్మాత నష్టపోయాక వెనక్కి ఇవ్వడం కన్నా ఇలా చేయడం మంచిదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు హీరోలు ఈ మార్గాన్నే అనుసరిస్తున్నారు.

ఐతే ఇటీవల యువ కథానాయకుడు రామ్ కూడా ఈ సూత్రాన్ని ఫాలో అయ్యాడు. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రానికి పారితోషకం తీసుకోకుండా రెండు ఏరియాల రైట్స్ తీసుకున్నాడు. కానీ ఆ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో రామ్ నష్టపోయాడు.

ఐతే సినిమా రిజల్ట్‌ను బట్టే తనకు పారితోషకం దక్కింది కాబట్టి అది న్యాయమే అన్న చర్చ జరిగింది టాలీవుడ్లో. ఇక వర్తమానంలోకి వస్తే.. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా భారీగా పారితోషకం తీసుకుంటాడని పేరున్న రవితేజ, తన కొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ విషయంలో రూటు మార్చాడు. 

ఈ సినిమాకు రవితేజ ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదని నిర్మాతే స్వయంగా వెల్లడించాడు. రిలీజ్ తర్వాత లాభాల్లో వాటా తీసుకోవడానికి రెడీ అయ్యాడు మాస్ రాజా. రవితేజ సినిమాలు వరుసగా డిజాస్టర్లు కావడంతో నిర్మాతలు దారుణంగా దెబ్బ తిన్నారు. ఆయన మార్కెట్ కూడా దెబ్బ తింది.

ఇప్పుడు ఆయనకు సక్సెస్ చాలా అవసరం. ఈ నేపథ్యంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా విషయంలో ఆయన నిర్మాతకు పూర్తిగా తన సహకారం అందించారు. ఈ చిత్రం మంచి ఫలితం అందుకుంటుందని ధీమాతో ఉన్న రవితేజ.. లాభాల్లో వాటా తీసుకోవడానికి రెడీ అయ్యాడు. మరి ఆయన నమ్మకం నిలబడుతుందా.. లేక రామ్ లాగా రవితేజ కూడా దెబ్బ తింటాడా అన్నది చూడాలి.