ప్రస్తుతం టాలీవుడ్లో ఏ పెద్ద సినిమా రిలీజ్ కావాలన్నా బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే ముందు టికెట్ రేట్ల పంచాయితీనే ఎక్కువగా వినిపిస్తోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా బుకింగ్స్ ఓపెన్ కాక ఆడియన్స్ వెయిట్ చేయాల్సి రావడం ఇప్పుడు ఒక రెగ్యులర్ డ్రామాగా మారిపోయింది. ప్రతి సినిమాకూ ఈ పర్మిషన్ల కోసం చివరి నిమిషం వరకు టెన్షన్ పడటం ఇండస్ట్రీకి ఒక పెద్ద తలనొప్పిగా మారింది.
నిజానికి ఒక భారీ బడ్జెట్ సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ లో ఉండే జోష్ అంతా ఇంతా కాదు. కానీ టికెట్ రేట్ల పెంపు, ఎర్లీ మార్నింగ్ షోల పర్మిషన్ల కోసం మేకర్స్ కోర్టుల చుట్టూ, ప్రభుత్వాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ లీగల్ ఇబ్బందుల వల్ల షోలు పడతాయో లేదో అన్న భయం ఫ్యాన్స్ లో, డిస్ట్రిబ్యూటర్లలో చివరి నిమిషం వరకు కొనసాగుతోంది. ఇది సినిమా ఓపెనింగ్స్ మీద కూడా గట్టి ప్రభావం చూపుతోంది.
చాలా ఏళ్లుగా ప్రతి సినిమాకూ ఇదే పరిస్థితి రిపీట్ అవుతోంది. ఒక్కో సినిమాకు ఒక్కోసారి ప్రభుత్వం దగ్గరకు వెళ్లి పర్మిషన్ అడగడం కంటే, ఈ సమస్యకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత కాలంలో సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది, దానికి తగ్గట్టుగా పాత టికెట్ ధరలను రివైజ్ చేయాల్సిన బాధ్యత అటు ఇండస్ట్రీకి, ఇటు ప్రభుత్వాలకు ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో ఇండస్ట్రీ పెద్దలు కూర్చుని ఒక క్లియర్ పాలసీని డిజైన్ చేయాలి. ప్రతి సినిమాకూ విడివిడిగా కాకుండా, బడ్జెట్ మరియు స్కేల్ ని బట్టి టికెట్ ధరలు ఎలా ఉండాలి, అదనపు షోలకు ఉన్న వెసులుబాట్లు ఏమిటి అనే దానిపై ఒక స్పష్టమైన గైడ్ లైన్స్ ఉంటే ఈ చివరి నిమిషం టెన్షన్లు ఉండవు. అప్పుడు ఆడియన్స్ కూడా ప్లాన్డ్ గా టికెట్లు బుక్ చేసుకునే వీలుంటుంది. ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి విధానం గురించే ఆలోచిస్తున్నట్టు సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్ వెల్లడించారు.
కేవలం టికెట్ ధరలే కాదు, ఓటీటీ ఎఫెక్ట్ వల్ల కూడా థియేటర్లకు జనాలు రావడం తగ్గుతోంది. ఇలాంటి టైమ్ లో టికెట్ రేట్ల పంచాయతీని సాగదీయడం వల్ల సామాన్య ప్రేక్షకుడు థియేటర్ కు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ధరలను అందరికీ అందుబాటులో ఉంచుతూనే, నిర్మాతలకు నష్టం కలగకుండా ఒక మిడిల్ పాత్ ని కనుగొనడం ఇప్పుడు ఇండస్ట్రీ ముందున్న అతిపెద్ద సవాలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates