మెగాస్టార్ సినిమా టికెట్ అక్షరాలా రూ.1,11,111

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ సినిమా ఫీవర్‌ మొదలైంది. ఫస్ట్‌డే–ఫస్ట్‌షో టికెట్ల కోసం మెగా అభిమానులు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో అమలాపురంలో జరిగే ప్రీమియర్‌ షో టికెట్‌ వేలంలో అభిమాని వెంకట సుబ్బారావు రూ.1.11 లక్షలకు టికెట్‌ను దక్కించుకోవడం సంచలనంగా మారింది.

నరసాపురంలోని అన్నపూర్ణ థియేటర్‌లో మరో టికెట్‌ రూ.లక్షా రెండు వేల వరకు పలికింది. అమలాపురంలో తొలి టికెట్‌ను బీజేపీ నాయకుడు వేలంలో సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ వేలం ద్వారా సమకూరిన మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ కు విరాళంగా అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. హీరోలపై ఉన్న అభిమానాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించడం పట్ల పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి కానుకగా ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ చిత్రం జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా, టికెట్ల వేలాలు ఇప్పటికే మెగా ఫీవర్‌కు నిదర్శనంగా మారుతున్నాయి.