తారక్, బన్నీ… రావిపూడి కథ నచ్చలేదా?

నందమూరి కళ్యాణ్ రామ్ లాంటి మిడ్ రేంజ్ హీరోతో తక్కువ బడ్జెట్లో తీసిన ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి. ఆ తర్వాత కూడా మూడు మిడ్ రేంజ్ మూవీసే తీసిన అనిల్.. అయిదో సినిమాకు ఏకంగా మహేష్ బాబుతో జట్టు కట్టాడు. వీరి కలయికలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ హిట్ అయింది.

తర్వాత భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సీనియర్ హీరో మూవీస్ చేసిన అనిల్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’తో రాబోతున్నారు. ఎప్పటికప్పుడు కుదిరిన సినిమా చేసుకుపోవడమే తప్ప.. ఈ తరం పెద్ద స్టార్‌తో చేయాలని వెయిట్ చేయడం అనిల్ కెరీర్లో ఎప్పుడూ జరగలేదు. అలా అని టాప్ స్టార్లతో సినిమాలు చేయాలని తనకు ఆశ లేదని కాదని.. ఆ ప్రయత్నాలు చేశానని చెప్పాడు అనిల్.

‘‘జూనియర్ ఎన్టీఆర్ గారికి గతంలో రెండు మూడు కథలు చెప్పా. బన్నీ గారిని కూడా కలిసి ఒక స్టోరీ మీద డిస్కస్ చేశాను. కానీ ఆ కథలేవీ వర్కవుట్ కాలేదు. ఇందులో నా ఫెయిల్యూరే ఉందని అనుకుంటా. వాళ్లను ఎగ్జైట్ చేసేలా కథలు తయారు చేసి ఉండకపోవచ్చు. లేదా అప్పటికి వాళ్లకు నా మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు.

నేను ఫలానా స్టార్‌తోనే సినిమా చేయాలి. ఇంకా పెద్ద రేంజ్ మూవీ చేయాలి అని వెయిట్ చేస్తూ కూర్చోను. ఒక సినిమా రిలీజైందా.. ఇంకో  మూడు నాలుగు నెలలకే తర్వాతి సినిమా సెట్స్ మీదికి వెళ్లిపోవాలి. అప్పటికి ఏ కథ కుదిరితే ఆ కథ.. ఏ హీరోతో సెట్ అయితే ఆ హీరోతో ముందుకు వెళ్లిపోతుంటా’’ అని అనిల్ తెలిపాడు. 

సంక్రాంతి తనకు బాగా కలిసొచ్చిన సీజన్ అని.. మూడు చిత్రాలు ఈ పండక్కే రిలీజై మంచి ఫలితాన్ని అందుకున్నాయని.. పటాస్‌ను సైతం సంక్రాంతి సినిమాలాగే ఫీలవుతానని.. ఈ సంక్రాంతికి వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సైతం పెద్ద హిట్టవుతుందని ఆశిస్తున్నానని అనిల్ చెప్పాడు. తాను ప్రయోగాలు చేయననేమీ లేదని.. ‘రాజా ది గ్రేట్’ కంటే ప్రయోగం ఏముంటుందని.. ఈ సినిమాకు సీక్వెల్ తీస్తే కూడా బాగుంటుందని అనిల్ అభిప్రాయపడ్డాడు.