నెల రోజులు తిరక్కుండానే సినిమా అయిపాయె

‘శతమానం భవతి’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయంతో పాటు అవార్డులు సైతం కొల్లగొట్టిన దర్శకుడు సతీశ్ వేగేశ్న. ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రాలతో పోటీ పడి ‘శతమానం భవతి’ బ్లాక్‌బస్టర్ అయింది. అంతే కాక ఆ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం కూడా దక్కింది.

ఐతే ఈ సినిమా తర్వాత సతీశ్ అంచనాల్ని అందుకోలేకపోయాడు. అతడి నుంచి వచ్చిన శ్రీనివాస కళ్యాణం, ఎంత మంచివాడవురా ప్రేక్షకులను ఎంతమాత్రం మెప్పించలేకపోయాయి. ‘శతమానం భవతి’ కంటే ముందు సతీశ్ తీసిన రామదండు, దొంగల బండి కూడా నిరాశ పరిచాయి. దీంతో సతీశ్ వన్ ఫిలిం వండర్‌లా మిగిలిపోయాడు. ‘ఎంత మంచివాడవురా’ తర్వాత పేరున్న హీరోలు, నిర్మాతల నుంచి అతడికి పిలుపు కూడా రాలేదు.

ఇలాంటి తరుణంలో స్వీయ నిర్మాణంలో ‘కోతి కొమ్మచ్చి’ అనే సినిమాను మొదలుపెట్టాడు సతీశ్. ఇందులో సతీశ్ తనయుడు సామ్ వేగేశ్న ఓ కథానాయకుడు కాగా.. శ్రీహరి తనయుడు మేఘాంశ్ మరో హీరో. రిద్ధి కుమార్, మేఘా చౌదరి కథానాయికలుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్, నరేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను అనౌన్స్ చేసింది మొదలుపెట్టింది నవంబరులోనే. కేవలం నెల రోజుల్లోపే ‘కోతి కొమ్మచ్చి’ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది.

కోవిడ్ నేపథ్యంలో చాలామంది ఫిలిం మేకర్లు పరిమితమైన కాస్ట్ అండ్ క్రూతో, తక్కువ లొకేషన్లలో సినిమాలు లాగించేస్తున్నారు. సతీశ్ సైతం పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగి గోదావరి ప్రాంతంలో తక్కువ రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. కొత్త ఏడాది ఆరంభంలోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. సతీశ్‌తో పాటు లీడ్ రోల్స్ చేస్తున్న అందరికీ చాలా ముఖ్యమైన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.