జననాయకుడికి ఇక్కడొచ్చేది బోనస్సే

జన నాయకుడు విడుదల రాజా సాబ్ తో పాటే ఉన్న నేపథ్యంలో ఏపీ తెలంగాణలో విజయ్ సినిమాకు వచ్చే ఓపెనింగ్స్ మీద అభిమానుల్లో బోలెడు సందేహాలున్నాయి. ఎందుకంటే ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం నెలల తరబడి కొనసాగుతూనే ఉంది.

ఇటీవలే పలు ప్రెస్ మీట్లలో దర్శకులు హెచ్ వినోత్ కానీ అనిల్ రావిపూడి కానీ దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. తలపతి సినిమా అంటూ ఎలివేషన్ ఇచ్చారు తప్పించి దానికి దీనికి సంబంధం లేదని కొట్టి పారేయలేదు. పైగా వదిలిన పాటల్లో శ్రీలీల పాత్రని మమిత బైజు చేసిందనే సూచనలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఇదే సమస్య కానుంది.

మాములుగా విజయ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు దక్కుతాయి. తుపాకీ నుంచి లియో దాకా గ్రాఫ్ చూసుకుంటే కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. సీరియల్ లా ఉందనిపించుకున్న వారసుడు సైతం దారుణంగా పోలేదు. విపరీతమైన పోటీలోనూ డీసెంట్ రెవిన్యూ అందుకుంది.

కానీ జన నాయకుడుకి అలాంటి ఛాన్స్ ఉండటం డౌటే. ఎందుకంటే భగవంత్ కేసరి మెయిన్ స్టోరీని మాత్రమే తీసుకుని ఎన్ని మార్పులు చేసినా, బాలయ్య సినిమా ఆల్రెడీ చూశాం కాబట్టి మళ్ళీ ఇది ఎందుకనే అభిప్రాయం సాధారణ ప్రేక్షకుల్లో ఉంటుంది. పైగా వేరే ఆప్షన్లు బోలెడున్నాయి. ఇది వసూళ్ల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది.

ఇదంతా జన నాయకుడు నిర్మాతలకు తెలియక కాదు. వాళ్ళ టార్గెట్ ప్రధానంగా తమిళ మరియు ఓవర్సీస్ మార్కెట్. అక్కడ వర్కౌట్ అయితే మొత్తం రికవరీ జరిగిపోతుంది. మన దగ్గర ఎంత వచ్చినా బోనస్ అవుతుంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు పంపిణికి అంత సుముఖంగా లేకపోవడంతో పివిఆర్ ఐనాక్స్ రంగంలోకి దిగి రిలీజ్ కు సహాయపడుతోంది.

తెలుగు ప్రమోషన్లు పూర్తి లైట్ తీసుకున్నారు. తమిళంలో ఉన్న హైప్ కనీసం పది శాతం ఇక్కడ ఉందా అంటే డౌటనిపించే స్థాయిలో బజ్ కనిపించడం లేదు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన జన నాయకుడులో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.