ప్ర‌భాస్ అంద‌రికీ తినిపిస్తాడు కానీ త‌ను మాత్రం…

ప్ర‌భాస్‌తో క‌లిసి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రూ త‌న గురించి మాట్లాడాల్సి వ‌చ్చిన‌పుడు.. అత‌ను క‌డుపు ప‌గిలిపోయేలా ఎలా ఫుడ్డు పెట్టి చంపేస్తాడో చెబుతుంటారు. ప్ర‌భాస్‌తో కొత్తగా సినిమా చేసిన వాళ్లు.. అత‌డి ఇంటి నుంచి వ‌చ్చే క్యారేజీల గురించి సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డం మాండేట‌రీ. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో ఫౌజీ సినిమా చేస్తున్న ఇమాన్వీ సైతం ప్ర‌భాస్ తన కోసం తెప్పించి వ‌డ్డించిన వంట‌కాల గురించి సోష‌ల్ మీడియాలో పంచుకుంది.

ప్ర‌భాస్ విందు భోజ‌నం అంటే.. క‌నీసం ప‌ది ర‌కాల వంట‌కాలైనా ఉండాల్సిందే. ఐతే తన చుట్టూ ఉన్న వారికి ఇలా అప‌రిమిత‌మైన ఫుడ్డు పెట్టే ప్ర‌భాస్.. తాను మాత్రం చాలా ప‌రిమితంగా తింటాడ‌ట‌. రాజాసాబ్ సెట్స్‌లో ఎప్పుడూ అత‌ను రైస్, ఇత‌ర ఐటెమ్స్ తిన‌డ‌మే చూడ‌లేద‌ని అంటోంది ఆ చిత్ర క‌థానాయిక‌ల్లో ఒక‌రైన నిధి అగ‌ర్వాల్.

ఒక ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ ఆహార‌పు అల‌వాట్ల‌పై నిధిని అడిగారు. అందుకామె బ‌దులిస్తూ.. ప్ర‌భాస్ ఎప్పుడూ చాలా ఆరోగ్య‌క‌ర‌మైన తిండే తింటాడ‌ని చెప్పింది. ఈ విష‌యంలో క్ర‌మ‌శిక్ష‌ణ పాటిస్తాడ‌ని పేర్కొంది. రాజాసాబ్ సెట్స్‌లో ఎప్పుడూ పండ్లే తీంటూ ఉండేవాడ‌ని ఆమె వెల్ల‌డించింది.

ఈ సినిమాలో పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా ప్ర‌భాస్ కొంచెం బ‌రువు త‌గ్గాల్సిన అవ‌స‌రం కూడా ఏర్ప‌డింద‌ని… దీంతో అతను స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేశాడ‌ని.. కొంచెం బ‌రువు కూడా త‌గ్గాడ‌ని ఆమె చెప్పింది. ప్ర‌భాస్ ఇంట్లో ఏమైనా వేరే ఫుడ్ తింటాడేమో తెలియ‌దు కానీ.. సెట్స్‌లో మాత్రం పండ్లు, డ్రైఫ్రూట్స్ లాంటివే తినేవాడ‌ని ఆమె చెప్పింది.

ప్ర‌భాస్ ఏర్పాటు చేసే విందు భోజ‌నాల గురించి చెప్పే వాళ్లంతా.. అత‌ను త‌మ డైట్ ప్లాన్స్ అన్నింటినీ దెబ్బ తీస్తున్నాడ‌ని.. త‌ను పెట్టేవ‌న్నీ తింటే అంతే సంగ‌తుల‌ని అంటుంటారు. అంద‌రికీ ఇలా లిమిట్ లెస్ ఫుడ్డు పెట్టే ప్ర‌భాస్.. తాను మాత్రం ఎంత స్ట్రిక్టుగా ఉంటాడో నిధి మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. సంక్రాంతి కానుక‌గా రాజాసాబ్ జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మాళ‌విక మోహ‌న‌న్, రిద్ధి కుమార్ కూడా హీరోయిన్లుగా న‌టించారు. సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర పోషించాడు. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించాడు.