అబ్బే… ఆయనేమీ మారలేదు!

సినిమా థియేటర్లు తెరవగానే ముందుగా తన సినిమానే విడుదలవుతోందని గప్పాలు చెప్పుకున్న రాంగోపాల్‍వర్మ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమానయితే తయారు చేయలేదు. ఇంతకుముందు తన సినిమాలు ఎలా వున్నా కానీ కనీసం కొంతమందిని అయినా థియేటర్లకు రప్పించేవి. కానీ శుక్రవారం విడుదలయిన కరోనా వైరస్‍ చిత్రానికి పలు షోస్‍కి సింగిల్‍ టికెట్‍ కూడా సేల్‍ కాలేదనేది ట్రేడ్‍ టాక్‍. సినిమా థియేటర్లు తెరిచేసినంత మాత్రాన ప్రేక్షకులు వచ్చి టికెట్లు కొనేయరు. అందులోను కాస్త రిస్కు కూడా వుందన్నపుడు అతి జాగ్రత్తగా తమ ఆప్షన్లు ఎంచుకుంటారు. ఇక సదరు సినిమా విషయానికి వస్తే మరోసారి విషయం లేని కథ, కథనాలతో పిచ్చి కెమెరా యాంగిల్స్ తో కరోనా వైరస్‍ అనే అంశాన్ని క్యాష్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలా వుందే తప్ప సినిమా తీయడానికి చేయాల్సిన కృషి, తపన ఏమీ కనిపించలేదని విమర్శకులు తిట్టి పోస్తున్నారు.

ఏటీటీ ద్వారా సినిమాలు విడుదల చేస్తానని చెప్పిన వర్మ ఆ ప్లాట్‍ఫామ్‍ని అతి దారుణంగా దుర్వినియోగం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్‍ పేరుతో జనాన్ని జాగృతం చేయడమో లేదా కనీసం థ్రిల్‍ చేయడమో చేసినట్టయితే బాగానే వుండేది. కానీ దగ్గుతోన్న వ్యక్తి చుట్టూ వుండే కుటుంబ సభ్యులు ఎలా భయపడతారనేది మాత్రం చూపించేసి అదే సినిమా అనేయడంతో కరోనా వైరస్‍ చూసిన ఆ కొద్ది మందిని కూడా ఠారెత్తించింది. ఇకనైనా ఏ అంశాన్ని తీసుకుంటే ప్రేక్షకుల అటెన్షన్‍ లభిస్తుందని ఆలోచించడం కంటే ఎలాంటి సినిమా తీస్తే నచ్చుతుందనేది ఆయన ఆలోచించుకుంటే మంచిది.