ఊహించ‌ని వివాదంలో రాజసాబ్ డైరెక్టర్

స్టేజ్ మీద య‌థాలాపంగా మాట్లాడే కొన్ని మాట‌లు పెద్ద వివాదానికే దారి తీస్తుంటాయి. సెల‌బ్రెటీలు ఆ మాట‌లు మాట్లాడేట‌పుడు వాటి తీవ్ర‌త తెలియ‌దు. కానీ సోష‌ల్ మీడియా జ‌నాల దృష్టిలోకి ఆ మాట‌లు చేరాయంటే ఇక అంతే సంగ‌తులు. కొన్ని గంట‌ల్లోనే ఆ విష‌యాలు కూడా పెద్ద వివాదాలుగా మారిపోతుంటాయి.

ఇటీవ‌ల న‌టుడు శివాజీ హీరోయిన్ల వ‌స్త్ర‌ధార‌ణ గురించి చేసిన కామెంట్లు చుట్టూ ఎంత పెద్ద గొడ‌వ జ‌రిగిందో తెలిసిందే. వారం త‌ర్వాత కూడా ఆ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. తాజాగా ద‌ర్శ‌కుడు మారుతి చేసిన చిన్న కామెంట్.. సోష‌ల్ మీడియాలో ఫ్యాన్ వార్స్‌కు దారి తీసింది. ప్ర‌భాస్ అభిమానుల‌కు అత‌డి వ్యాఖ్య‌లు ఆగ్ర‌హం తెప్పించాయి.

రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో మారుతి చాలా ఎమోష‌న‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ గురించి చాలా గొప్ప‌గా మాట్లాడాడు.. త‌న‌కు ఇవ్వాల్సిన ఎలివేష‌న్ ఇచ్చాడు. సినిమా విష‌యంలో కూడా చాలా ధీమాగా మాట్లాడి అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. కానీ స్పీచ్ మ‌ధ్య‌లో ప్ర‌భాస్ ఒక‌ప్ప‌టి ఇమేజ్ గురించి అత‌ను వాడిన ఒక పదం అభిమానుల‌కు కోపం తెప్పించింది.

మీడియం రేంజ్ హీరోగా ఉన్న ప్ర‌భాస్‌ను రాజ‌మౌళి పాన్ ఇండియా సూప‌ర్ స్టార్‌ను చేశాడ‌ని.. అందుకు ఆయ‌న‌కు ద‌ర్శ‌కులంద‌రూ రుణ‌ప‌డి ఉంటార‌ని ఒక కామెంట్ చేశాడు మారుతి. ఇందులో దురుద్దేశం ఏమీ లేక‌పోయినా.. ఒక‌ప్పుడు ప్ర‌భాస్ మీడియం రేంజ్ హీరో అని పేర్కొన‌డం రెబ‌ల్ ఫ్యాన్స్‌కు న‌చ్చ‌లేదు. వాళ్లు స్పందించ‌డాని కంటే ముందు యాంటీ ఫ్యాన్స్ ఈ మాట‌ను ప‌ట్టుకుని ప్ర‌భాస్‌ను ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు.

బాహుబ‌లి లేకుంటే ప్ర‌భాస్ ఇంత పెద్ద స్టార్ అయ్యేవాడు కాదని.. ఈ సినిమాతో లాట‌రీ కొట్టాడ‌ని కామెంట్లు చేశారు. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ట్రిగ్గ‌ర్ అయి వారితో గొడ‌వ పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో అన‌వ‌స‌ర కామెంట్ చేశాడంటూ మారుతి మీద వాళ్లు మండిప‌డుతున్నారు.

బాహుబ‌లి కోసం అసాధార‌ణంగా క‌ష్ట‌ప‌డి ఆ సినిమాకు పెద్ద బ‌లంగా మారడం, ఆ సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించ‌డం.. ఆ త‌ర్వాత కూడా ఆ ఇమేజ్‌, ఫాలోయింగ్ క్యారీ చేస్తూ భారీ చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న ఘనత ప్రభాస్ ది. రాజ‌మౌళితో సినిమాలు చేసిన ఇంకే హీరోకూ ప్ర‌భాస్ స్థాయి రాక‌పోవ‌డాన్ని బ‌ట్టి త‌నకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వాల్సిందే.