దెయ్యాలకు పట్టం కట్టిన ప్రేక్షకులు

ఏడాది చివర్లో వచ్చిన క్రిస్మస్ ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊహించని ఫలితాలు ఇచ్చింది. పోటీ గట్టిగానే ఉన్నప్పటికీ ప్రేక్షకుల తీర్పు అనూహ్యం. వచ్చిన అరడజను సినిమాల్లో సాలిడ్ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వేగంగా ప్రవేశించిన సినిమాలు రెండు. అవి శంబాల, ఈషా. వీటిలో ఉన్న కామన్ పాయింట్ హారర్. దెయ్యాల నేపథ్యంలో సాగుతాయి.

ఆది సాయికుమార్ మూవీలో దేవుళ్ళ ప్రస్తావన ఉన్నప్పటికీ ఒక పావు గంట మినహాయించి మొత్తం ఊరి జనాన్ని చంపేసే భూతం గోలే ఉంటుంది. అయినా సరే జనాలకు కనెక్ట్ అయ్యింది. సోమవారం డ్రాప్ ఎలా ఉంటుందనేది పక్కనపెడితే చక్కగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది.

ఇక ఈషాకు నెగటివ్ రివ్యూలు ఎక్కువగా వచ్చాయి. కంటెంట్, ప్రొడక్షన్ క్వాలిటీ మీద క్రిటిక్స్ కాస్త గట్టిగానే తలంటారు. అయినా సరే ప్రేక్షకులు ఓసారి చూద్దామనుకున్నారు. బడ్జెట్, బిజినెస్ రెండూ తక్కువే కాబట్టి ఈజీగా గెటాన్ అయ్యే ఛాన్స్ కొట్టేసింది.

రేపటి నుంచి అద్భుతాలు జరగకపోవచ్చు కానీ కాగల కార్యం శుక్రవారం నుంచి ఆదివారం మధ్యలో జరిగిపోయింది. అనూహ్యంగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఛాంపియన్ ఎదురీదాల్సి రావడం ఊహించని పరిణామం. ప్రయత్నంలో నిజాయితీ ఉన్నప్పటికీ యునానిమస్ గా ఆడియన్స్ ని మెప్పించడంలో దర్శకుడు పడిన తడబాటు రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది.

అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. జనవరి 1 రూపంలో క్రిస్మస్ బంచ్ మూవీస్ కి ఇంకో ఛాన్స్ అయితే ఉంటుంది. విచిత్రంగా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న దండోరా ఈ హారర్ కాంపిటీషన్ లో నిలవలేకపోయింది. సోలోగా వచ్చి ఉంటే బాగా ఆడేదనే కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న నేపథ్యంలో నిర్మాతలు రాంగ్ టైమింగ్ లో రిలీజ్ చేశారనేది అంత సులభంగా కొట్టి పారేయలేని విషయం.

సంక్రాంతి దగ్గర పడుతున్న తరుణంలో మెల్లగా ఆడియన్స్ మనసులు, పర్సులు అటువైపు షిఫ్ట్ అయిపోతాయి. సో ఆలోగా వీలైనంత రాబట్టుకోవడమే క్రిస్మస్, న్యూ ఇయర్ సినిమాల తక్షణ కర్తవ్యం.