త్రివిక్రమ్ ఒరలో అసలు కత్తి ఎవరు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి వార్తల్లోకి వచ్చేశారు. వెంకటేష్ తో సైలెంట్ గా ఆదర్శ కుటుంబం ఏకె 47 షూటింగ్ చేస్తుండగా ఇప్పుడు మరోసారి ఎందుకు హాట్ టాపిక్ అయ్యారనే సందేహం అందరిలోనూ తలెత్తుతోంది. అల్లు అర్జున్ ముందు ఓకే చేసి తర్వాత వద్దనుకున్న ఫాంటసీ సబ్జెక్టు మరోసారి బన్నీ దగ్గరికే వచ్చిందనే గాసిప్ గట్టిగానే తిరుగుతోంది.

ఇదే కథని జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పి ఓకే చేయించుకున్నారనే వార్త నెలల క్రితమే బయటికి వచ్చింది. నిర్మాత నాగవంశీ సైతం నిర్ధారణగా చెబుతూ ట్వీట్లు పెట్టారు, పలు ఇంటర్వ్యూలలో మాట్లాడారు. కానీ ఇప్పుడు మళ్ళీ రివర్స్ ఎందుకయ్యిందనేది ప్రశ్న.

ఈషా ప్రెస్ మీట్ లో బన్నీ వాస్ మాట్లాడుతూ ఇది చాలా సున్నితమైన విషయమని, జనవరిలో అనౌన్స్ మెంట్స్ వస్తాయని అన్నారు తప్పించి స్ట్రెయిట్ గా సమాధానం చెప్పలేదు. అంటే నర్మగర్భంగా ఏదో ఉందనే అర్థం వస్తోంది. గతంలో ఎన్టీఆర్ తో ఒక సినిమా అనుకుని దానికి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ లీక్ చేసి తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం ఫ్యాన్స్ మర్చిపోలేదు.

దాని స్థానంలోనే గుంటూరు కారం వచ్చిందనేది ఇన్ సైడ్ టాక్. ఇప్పుడు ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ తారక్ ని వదిలేసి బన్నీకి షిఫ్ట్ అయిపోవడం దేనికి సంకేతమో అర్థం కావడం లేదని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

ఇప్పట్లో దీనికి సంబంధించిన క్లారిటీ రాకపోవచ్చు. ఒకవేళ బన్నీతోనే కన్ఫర్మ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అట్లీ ప్యాన్ ఇండియా మూవీ 2026 వేసవికి అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రీనే. లోకేష్ కనగరాజ్ హైదరాబాద్ వచ్చి కలిశాడనే టాక్ ఉంది కానీ అందులో నిజమెంతో తెలియదు.

వేరే పని మీద నిర్మాతలను కలవడానికి వచ్చి వెళ్ళిపోయినట్టు సమాచారం. ఇక తారక్ సంగతి చూస్తే ప్రశాంత్ నీల్ డ్రాగన్ తర్వాత దేవర 2కి కమిట్ కావడం దాదాపు ఖరారు. అదే జరిగితే 2027 దాకా డైరీ ఫుల్  అయిపోతుంది. అటుపై నెల్సన్ దిలీప్ కుమార్ వెయిటింగ్ లో ఉన్నాడు. సో ప్రాక్టికల్ గా చూస్తే త్రివిక్రమ్ – అల్లు కాంబోనే రిపీటయ్యేలా ఉంది కానీ అధికారికంగా క్లారిటీ వచ్చేదాకా నమ్మలేం.