ఎ సర్టిఫికెట్ తో దురంధురుడి విధ్వంసం

ఈ నెల మొదటి వారంలో ‘దురంధర్’ సినిమా రిలీజవుతుంటే.. దాని చుట్టూ చాలా వరకు నెగెటివిటీనే కనిపించింది. ఫ్లాపుల్లో ఉన్న రణ్వీర్ సింగ్‌ను చూడ్డానికి జనం వస్తారా.. ఏ ధైర్యంతో దీనిపై 350 కోట్ల బడ్జెట్ పెట్టారు.. మూడున్నర గంటలకు పైగా నిడివి అంటే తట్టుకోగలరా.. అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగా ఉన్నాయే అంటూ రకరకాల కామెంట్లు వినిపించాయి. కానీ రిలీజ్ తర్వాత అంతా మారిపోయింది.

సినిమాకు మోడరేట్ రివ్యూలు వచ్చినా సరే.. బాక్సాఫీస్ దగ్గర ఆ చిత్రం అద్భుతాలు చేస్తూ సాగిపోయింది. కొత్త సినిమాలకు రోజులు గడిచేకొద్దీ వసూళ్లు నెమ్మదించడం సహజం. కానీ ఈ చిత్రానికి అంతకంతకూ వసూళ్లు పెరుగుతూ పోయాయి. మూడో వారంలో కూడా జోరు తగ్గించలేదు దురంధర్. ‘అవతార్-3’ లాంటి క్రేజీ మూవీ వచ్చినా దాన్ని కూడా డామినేట్ చేసింది. తాజాగా ఈ మూవీ హిందీలో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ‘ఛావా’ పేరిట ఉన్న రూ.800 కోట్ల మైలురాయిని ‘దురంధర్’ దాటేసింది.

ఇక ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా ‘దురంధర్’ నిలవడం కూడా లాంఛనమే. ‘కాంతార: చాప్టర్-1’ రూ.850 కోట్ల వసూళ్లతో రికార్డు నెలకొల్పింది. ‘దురంధర్’ మూడో వీకెండ్లోనూ రూ.95 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. హిందీలో ఈ వారం ‘తూ మేరీ మై తేరా.. మై తేరా తూ మేరీ’ సినిమా రాబోతోంది. దానికి కొంచెం క్రేజ్ ఉన్నా సరే.. ‘దురంధర్’ను డామినేట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు.

క్రిస్మస్ వీకెండ్లోనూ కూడా రణ్వీర్ సినిమానే లీడ్ తీసుకునేలా ఉంది. వీకెండ్ వచ్చేలోపే ‘కాంతార’ రికార్డును బద్దలు కొట్టి రూ.1000 కోట్ల మైలురాయిని కూడా టార్గెట్ చేసేలా ఉంది ‘దురంధర్’. బాక్సాఫీస్ దగ్గర అన్నీ కలిసొస్తే.. ఈ ఏడాది వెయ్యి కోట్ల సినిమా లేని లోటును ఇది తీర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫుల్ రన్లో రూ.వెయ్యి కోట్లు సాధ్యమే కానీ.. ఈ ఏడాదే ఆ రికార్డును అందుకుంటుందా లేదా అన్నదే సస్పెన్సు.