ఇడియట్స్ జోలికి ఇప్పుడెందుకు వెళ్లడం

2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్ గా చూపించి దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ చేసిన మేజిక్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. విద్య వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ సున్నితంగా విమర్శిస్తూనే వినోదాత్మకంగా చెప్పడంలో ఈ క్లాసిక్ స్టయిల్ వేరే లెవెల్. శంకర్ అంతటి లెజెండరీ డైరెక్టర్ ముచ్చటపడి మరీ విజయ్ తో తమిళ రీమేక్ చేస్తే అక్కడేమో దారుణంగా ఫెయిలయ్యింది. ఒరిజినల్ వెర్షన్ చేసిన మాయాజాలం అది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టకుండా చేయడంలో 3 ఇడియట్స్ రూటే వేరు.

ఇప్పుడు పదహారు సంవత్సరాల తర్వాత 3 ఇడియట్స్ సీక్వెల్ తీయడానికి అమీర్ ఖాన్, హిరానీ రెడీ అవుతున్నారు. అదేంటి ఇప్పుడెలా వర్కౌట్ అవుతుందనే డౌట్ వస్తోంది కదూ. మూవీ లవర్స్ అదే ప్రశ్న అడుగుతున్నారు. ఒక కల్ట్ మూవీగా నిలిచిపోయిన 3 ఇడియట్స్ కి కొనసాగింపు అంటే ఖచ్చితంగా రిస్క్ అవుతుందని మానుకోమని హెచ్చరిస్తున్నారు. షారుఖ్ ఖాన్ డంకీ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో రాజ్ కుమార్ హిరానీ షాక్ తిన్నారు. అపజయం లేని ఆయన ట్రాక్ రికార్డులో ఇదో యావరేజ్ మూవీ అయ్యింది. ఏళ్ళ గ్యాప్ తర్వాత చేసిన సినిమాకు ఈ రిజల్ట్ ఫ్యాన్స్ ఊహించలేదు.

అందుకే ఇప్పుడు 3 ఇడియట్స్ వైపు మొగ్గు చూపారేమో. హిరానీకి సీక్వెల్స్ కొత్త కాదు. మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగే రహో మున్నాభాయ్ రెండూ తక్కువ గ్యాప్ లో తీసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. మున్నాభాయ్ ఛలో అమెరికా అంటూ మూడో భాగానికి స్క్రిప్ట్ రాసుకున్నారు కానీ ఎందుకనో తెరకెక్కించలేదు. ఇప్పుడు దశాబ్దంన్నర తర్వాత 3 ఇడియట్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఎలాగూ అందులో నటించిన ఆర్టిస్టులు అందరూ అందుబాటులో ఉన్నారు. అమీర్ ఖాన్, కరీనా కపూర్, మాధవన్, బోమన్ ఇరానీ తదితరులంతా సీక్వెల్ లో వచ్చేస్తారు. కాకపోతే అప్పటి మేజిక్ రీ క్రియేట్ చేయడం మీద డౌట్.