తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే తరహాలో కొద్దిరోజుల క్రితం చిరంజీవి, నాగార్జున లాంటి సెలబ్రిటీలు డిజిటల్ రక్షణ పొందిన సంగతి తెలిసిందే. నిజానికిదంతా ప్రారంభమే అని చెప్పాలి. ఎందుకంటే ఏఐ మెల్లగా జనాల్లోకి చొచ్చుకుపోతోంది. పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలో ప్రాథమికంగా నేర్చుకుంటే చాలు బోలెడు మేజిక్ చేయొచ్చు. అదే ఇప్పుడు సోషల్ మీడియా కొంప ముంచుతోంది. గత కొన్ని వారాలుగా ఈ ట్రెండ్ ఊపందుకుంది.
స్టార్ హీరోలంతా ఒక టీ కొట్టు దగ్గర కాఫీ తాగుతున్నట్టు, అందరూ కలిసి జాతరకు వెళ్లినట్టు, క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నట్టు ఇలా రకరకాలుగా వీడియోలు సృష్టించి లక్షల్లో వ్యూస్ సంపాదిస్తున్నారు. ఇవన్నీ పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ట్రోలింగ్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్న కొందరు యాంటీ ఫ్యాన్స్ తప్పుడు వీడియోలు చేయడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. తారక్ లాంటి హీరోలు స్పందిస్తోంది ఇందుకే. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే తర్వాత తీవ్ర నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో అందరికి ఇది ముప్పుగా మారుతుంది. ప్రతి ఒక్కరు కోర్టు మెట్లు ఎక్కి ప్రొటెక్షన్ కావాలని అడుగుతారు.
ఏదైనా సరే మితిమీరితే ఇలాగే ఉంటుంది. ఏఐ వరుస చూస్తే నిజమనిపిస్తోంది. ఉచితంగా ప్రో వెర్షన్లను సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వడం, ఎలా వాడుకోవాలో ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో టిప్స్ ఇవ్వడం లాంటివి నెటిజెన్లకు కొత్త విద్యలు నేర్పిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు ఉద్దేశం మంచిదే అయినప్పటికీ దాన్ని తప్పుడు పద్దతి కోసం వాడితే అనర్థాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. కొన్నేళ్ల క్రితం రష్మిక మందన్న, అలియా భట్ లాంటి వాళ్ళు డీప్ ఫేక్ వీడియోల వల్ల ఇబ్బంది పడ్డారు. ఈ మధ్యే అకీరానందన్, గౌతమ్ లను హీరోలుగా పెట్టి ఒకడు గంట యూట్యూబ్ ఏఐ సినిమా తీశాడు. భవిష్యత్తులో ఇంకెన్ని విపరీతాలు చూడాలో.
Gulte Telugu Telugu Political and Movie News Updates