ఒరేయ్ ఆంజనేయులు… ఐకానిక్ ‘అమృతం’ ఈజ్ బ్యాక్

“19 ఏళ్ల కిందట ఏడుపుగౌట్టు సీరియళ్లు తెలుగు టీవీ తెరపై ఆధిపత్యం చలాయిస్తుండగా.. ఒక వ్యక్తి దృఢ సంకల్పంతో మొదలుపెట్టిన ఓ తెలుగు కామెడీ షో సంప్రదాయ తెరలన్నింటినీ తొలగించేసింది. ఐదుసార్లు మళ్లీ మళ్లీ ప్రసారమైన ఏకైక సీరియల్. 2.7 కోట్ల వ్యూస్ తెచ్చుకున్న సీరియల్. గత ఆరు నెలల వ్యవధిలోనే 60 లక్షల వ్యూస్.. పరాజితులైన అంజి, అమృతరావుల విజయగాథ ఇది. అమృతం అనే పేరు సార్థకత చేకూరుస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన సీరియల్’’ ఒక సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి వేసిన ట్వీట్ ఇది.

రాజమౌళే ఆ స్థాయిలో ‘అమృతం’ గురించి ఎలివేషన్ ఇచ్చాడంటే దాని గొప్పదనానికి అంతకంటే రుజువు ఏముంటుంది? రాజమౌళి బంధువు అయిన లెజెండరీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గుణ్ణం గంగరాజు బుల్లితెరపై సృష్టించిన అద్భుత దృశ్య కావ్యంగా ‘అమృతం’ను చెప్పొచ్చు. టీవీలో ఇంకే సీరియల్‌కూ రాని ఎవర్ గ్రీన్ కల్ట్ ఫాలోయింగ్ దీనికి వచ్చింది. తర్వాత యూట్యూబ్‌లోనూ ఎన్నో ఏళ్లుగా ఈ సీరియల్ ఎపిసోడ్లు ‘అమృతం’ అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు ‘అమృతం’ సరికొత్తగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. పాత ఎపిసోడ్లనే రీమాస్టర్ చేయించి కొత్తగా రిలీజ్ చేస్తోంది చిత్ర బృందం. పాత సినిమాలను రీమాస్టర్ చేసి రీ రిలీజ్ చేస్తున్నట్లే.. ఈ సీరియల్లో ఎపిసోడ్లకు కూడా ఆడియో, వీడియోలకు మెరుగులు దిద్ది ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ సోమవారం నుంచే రోజుకు రెండు ఎపిసోడ్ల చొప్పున సరికొత్తగా ప్రేక్షకులను అలరించబోతోంది అమృతం.

ఈ ఐకానిక్ సీరియల్లో కొన్ని ఎపిసోడ్లను ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేయడం విశేషం. తర్వాత చాలా వరకు గుణ్ణం గంగరాజు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు. అమృతం పాత్రలో అత్యధిక కాలం అలరించిన హర్షవర్ధన్ కూడా కొన్ని ఎపిసోడ్లు తీశాడు. ఈ పాత్రను శివాజీ రాజా, నరేష్ సైతం కొన్ని ఎపిసోడ్లలో పోషించిన సంగతి తెలిసిందే.