అబ్బాయి ఏమో అలా… బాలయ్య ఏమో ఇలా!

నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం.. ఆదిత్య 369. 90వ దశకం ఆరంభంలో ఎంతో అడ్వాన్స్డ్‌గా ఆలోచించి ఈ సినిమాను అద్భుత రీతిలో తెరకెక్కించారు సింగీతం శ్రీనివాసరావు. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని బాలయ్య ఎప్పట్నుంచో ఆశపడుతున్నాడు. సింగీతం దర్శకత్వంలోనే కొన్నేళ్ల ముందు ‘ఆదిత్య 999’ పేరుతో ఆ సినిమా చేయడానికి సన్నాహాలు జరిగాయి. 

కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. అలా అని దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అనుకోవడానికి వీల్లేదు. బాలయ్య ఎప్పటికప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. తాజాగా ఆయన మరోసారి ‘ఆదిత్య 369’ సీక్వెల్ గురించి ప్రస్తావించాడు. తన కొత్త చిత్రం ‘అఖండ-2’ ప్రమోషన్లలో భాగంగా ఒక నేషనల్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఆయన ఒక ఆసక్తికర ప్రకటన చేశారు.

‘ఆదిత్య 999 ప్రో మ్యాక్స్’ పేరుతో ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయనున్నట్లు బాలయ్య వెల్లడించారు. అంతే కాక అందులో తన కొడుకు మోక్షజ్ఞ కూడా నటిస్తాడని ఆయన స్పష్టం చేశారు. తన కొడుకుతో కలిసి ఆదిత్య 369 సీక్వెల్ చేస్తానని బాలయ్య గతంలోనూ ప్రకటించాడు. మోక్షజ్ఞకు ఇదే డెబ్యూ మూవీ అని కూడా గతంలో వార్తలు వచ్చాయి. కానీ రకరకాల కారణాలతో మోక్షజ్ఞ అరంగేట్రం ఆలస్యం అవుతూ వస్తోంది. 

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కూడా అనుకోకుండా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన తొలి చిత్రం ఏదవుతుందో.. అసలు అతనిప్పుడిప్పుడే అరంగేట్రం చేస్తాడా లేదా అన్న అయోమయం నెలకొంది. ఒకవేళ డెబ్యూ కి రెడీ అయితే మాత్రం మంచి లవ్ స్టోరీతోనే చేస్తా అని మోక్షు అనుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో బాలయ్య తన కొడుకుతో కలిసి ‘ఆదిత్య 999’ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి త్వరలో ఆ వార్త నిజం అవుతుందేమో చూడాలి. సింగీతం చాలా ఏళ్ల కిందటే స్క్రిప్టు రెడీ చేసి స్టోరీ బోర్డ్ కూడా పూర్తి చేశారు. ఐతే ఇప్పుడాయనకు వయసు మీదపడ్డ నేపథ్యంలో ఈ సినిమాను బాలయ్యే స్వయంగా డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నాడు.