జనం కోసం నాయకుడి మలేషియా ప్లాన్

పొలిటికల్ కెరీర్ కోసం కోలీవుడ్ ని వదిలేస్తున్న స్టార్ హీరో విజయ్ చివరి సినిమాగా జన నాయకుడు మీద తమిళనాడులో ఓ రేంజ్ అంచనాలున్నాయి. బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమని బయ్యర్లు అంటున్నారు. అయితే ఆడియో లాంచ్ ని మలేషియాలో ప్లాన్ చేసుకున్న విజయ్ ఆలోచనలు ప్రత్యర్థులకు అంత సులభంగా అంతు చిక్కడం లేదు. దీని వెనుకో పెద్ద మాస్టర్ ప్లాన్ ఉన్నట్టు అర్థమవుతోంది. అదేంటో చూద్దాం. విజయ్ కు ప్రాథమికంగా ఈవెంట్ చెన్నైలో చేయడమే ఇష్టం. గతంలో ఎంత రద్దీ వచ్చినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్నీ ప్రశాంతంగా జరిగాయి.

కానీ విజయ్ ర్యాలీ సందర్భంగా కరూర్ లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పవడంతో రాజకీయంగా ఆ ఘటన పెద్ద మచ్చ తెచ్చి పెట్టింది. ఇకపై సభలు ప్రచారాల కోసం పర్మిషన్లు అడిగితే అధికార పార్టీ సవాలక్ష కొర్రీలు పెట్టొచ్చు. ఇక సినిమా ఈవెంట్ అంటే తేలిగ్గా ఇస్తారా. ఈ తలనొప్పి ఎందుకని భావించిన విజయ్ ఏకంగా మలేషియా ప్లాన్ వేసుకున్నాడు. అక్కడ స్టేడియంలో జరిగే వేడుకని నభూతో న భవిష్యత్ రేంజ్ లో చేయబోతున్నారని సమాచారం. విజయ్ కెరీర్ లోని సూపర్ హిట్ సినిమాల పాటలన్నీ అనిరుధ్ రవిచందర్ లైవ్ గా పెర్ఫార్మ్ చేయబోతున్నాడు. దానికి సంబంధించి ప్రిపరేషన్స్ మొదలైపోయాయి.

దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా విదేశాల్లోనూ తనకెంత ఫాలోయింగ్ ఉందనేది విజయ్ నిరూపించబోతున్నాడు. ఇప్పటిదాకా ఏ ఇండియన్ హీరోకి మలేషియాలో జరగనంత గొప్పగా ఉండేలా సినిమా టీమ్ తో పాటు రాజకీయ బృందం కూడా రంగంలోకి దిగిందట. ఈ ఈవెంట్ ని ఆన్ లైన్ ద్వారా ఇక్కడి ఫ్యాన్స్ కి అందివ్వడం ద్వారా తనను మిస్ అయ్యారనే ఫీలింగ్ తగ్గించవచ్చు. విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ తెలుగులోనూ జనవరి 9నే రిలీజ్ చేయడానికి పలువురు డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నట్టు ఆల్రెడీ టాక్ ఉంది. అగ్ర నిర్మాతకే హక్కులు దక్కుతాయని సమాచారం. అతి త్వరలో అఫీషియల్ గా చెబుతారు.