నాగ్ ఫ్యామిలీ మెంబర్ డిజిటల్ అరెస్ట్

పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మను నడిపిస్తున్న ఇమ్మడి రవి అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పైరసీని అరికట్టడంలో ఇది పెద్ద బ్రేక్ త్రూగా ఇండస్ట్రీ జనాలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, దర్శక ధీరుడు రాజమౌళి వెళ్లి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కలిసి ఇండస్ట్రీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత సజ్జనార్‌తో కలిసి ఈ ముగ్గురూ ప్రెస్ మీట్లో కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఆన్ లైన్లో డేటా షేరింగ్ ఎంత ప్రమాదమో వివరించారు. ఉచితంగా పైరసీ సినిమాలు చూస్తున్నాం మనకేమవుతుంది అనుకుంటారు కానీ.. మనకు తెలియకుండానే పెద్ద ప్రమాదంలోకి వెళ్తుంటామని.. మనం చేసే తప్పులను ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటే పొరపాటని నాగ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తమ ఫ్యామిలీ మెంబర్ రెండు రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ అయిన విషయాన్ని ఆయన వెల్లడించారు.

ఆరేడు నెలల కిందట తమ కుటుంబంలో ఒకరు.. ఆన్ లైన్లో తెలియకుండా ఇల్లీగల్ వ్యవహారాల్లో భాగమై.. పోలీసుల దృష్టిలో పడ్డట్లు నాగ్ వెల్లడించారు. రెండు రోజుల పాటు ఆ వ్యక్తి డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నట్లు నాగ్ తెలిపారు. పోలీసులు ప్రతిదీ జాగ్రత్తగా గమనిస్తుంటారు అనడానికి ఇది ఉదాహరణ అని.. తమ ఫ్యామిలీ మెంబర్ అలెర్ట్ అయి పోలీసులకు విషయం వివరించగా.. ఆ వ్యక్తిని ముగ్గులోకి దించడానికి ప్రయత్నించిన వాళ్లను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారని.. కానీ నిమిషాల్లో వాళ్లు ఎస్కేప్ అయిపోయారని నాగ్ తెలిపాడు. 

ఐబొమ్మ అడ్మిన్ రూ.20 కోట్లు సంపాదించారని అంటున్నారని.. కానీ అది చాలా చిన్న అమౌంట్ అని.. రవి ఖాతాలో సీజ్ చేసిన రూ.3 కోట్లు చిల్లర కిందే లెక్క అని.. ఇదంతా వేల కోట్ల సామ్రాజ్యంతో ముడిపడిన విషయాలని నాగ్ అన్నాడు. ఆన్ లైన్లో ఉచితంగా పైరసీ సినిమాలు చూసేవాళ్లంతా అప్రమత్తంగా ఉండాలని.. ఇదంతా పచ్చి మోసం అని.. దీని వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నాగ్ హెచ్చరించారు. చిరు, రాజమౌళి సైతం పైరసీ సినిమాలు చూసేవాళ్లకు సున్నితంగానే హెచ్చరికలు జారీ చేశారు.