పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి అరెస్ట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీని గురించి సీనియర్ నటుడు శివాజీ స్పందించాడు. రవిని విమర్శిస్తూనే.. అతడిది అసాధారణమైన ప్రతిభ అని అర్థమవుతోందని.. అతణ్ని మంచి పని కోసం వాడుకోవాలని శివాజీ అభిప్రాయపడ్డాడు. రవి చేసంది దుర్మార్గమైన పని అని.. అతనేదో మంచి చేస్తున్నాను అనుకున్నాడని.. కానీ దాని ద్వారా చాలామందికి చెడు చేశాడని శివాజీ అన్నాడు.
ఐతే రవి గురించి విన్నపుడు.. అతడికేదో బాధ, డబ్బుల కోసం ఇదంతా చేశాడని అర్థమైందని.. అతనొక బ్రహ్మాండమైన హ్యాకర్ అని స్పష్టమవుతోందని.. ఇలాంటి ప్రతిభ ఉన్న వ్యక్తిలో మార్పు రావాలని.. వచ్చాక అతణ్ని దేశానికి సంబంధించిన సెక్యూరిటీ సిస్టమ్స్లో మంచి కోసం ఉపయోగించుకుంటే బాగుంటుందని శివాజీ అన్నాడు. తాను ప్రధాన పాత్ర పోషించిన ‘దండోరా’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శివాజీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
మరోవైపు సినిమా థియేటర్లలో పాప్ కార్న్ రేట్ల గురించి కూడా శివాజీ స్పందించాడు. సినిమాకు, పాప్ కార్న్కు ముడిపెట్టొద్దని ఆయన విన్నవించారు. రెంటికీ ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. సినిమా టికెట్ల రేట్ల విషయానికి వస్తే అవి అందుబాటులోనే ఉన్నాయని.. ప్రపంచంలో సినిమాను మించిన చౌక అయిన వినోదం మరొకటి లేదని శివాజీ అభిప్రాయపడ్డాడు.
దశాబ్దాల కిందట వచ్చిన మిస్సమ్మ, మాయాబజార్ సినిమాల గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నాం, గుర్తుంచుకున్నాం అని.. అదీ సినిమా చూపించే ప్రభావం అని శివాజీ అన్నాడు. థియేటర్లో 100 రూపాయలు పెట్టి చిప్స్ ప్యాకెట్ కొంటే అందులో 20 చిప్స్కు మించి ఉండవని.. కానీ 200 రూపాయలు పెట్టి సినిమా చూస్తే అదొక మంచి అనుభూతిని ఇచ్చి మన జీవితాంతం గుర్తుంటుందని శివాజీ అన్నాడు. పాప్ కార్న్ రేట్ల గురించి ఎక్కువ బ్లో అప్ చేయాల్సిన అవసరం లేదని.. దానికి సినిమాకు ఏం సబంధం అని శివాజీ ప్రశ్నించాడు.
ఏ రంగంలో అయినా లోటు పాట్లు, తప్పులు ఉంటాయని.. ఇలాంటి విషయాలను పట్టుకుని మొత్తం సినిమా గురించే చెడుగా మాట్లాడ్డం కరెక్ట్ కాదని శివాజీ అన్నాడు. ఇంతలో పక్కనున్న నవదీప్ అందుకుని.. ఉదయం టిఫిన్ చేశాక మార్నింగ్ షో మొదలవుతుందని.. మ్యాట్నీకి ముందు భోజనం చేస్తారని.. సాయంత్రం స్నాక్స్ టైం అయ్యాక ఫస్ట్ షో, మళ్లీ రాత్రి భోజనం తర్వాత సెకండ్ షో ఆరంభమవుతాయని.. అలాంటపుడు థియేటర్లో పాప్ కార్న్ ఎందుకు తినాలని.. దాని గురించి ఇంత చర్చ అనవసరమని అన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates