నవంబర్ నెల ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన మూవీ లవర్స్ కోరుకున్న ఘడియలు వచ్చేస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీ పదానికి కొత్త అర్థం ఇచ్చేలా రూపొందుతున్న మహేష్ బాబు – రాజమౌళి కలయికలోని సినిమాకు సంబంధించిన తొలి రివీల్ ఈ నెల 15 హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కనివిని ఎరుగని స్థాయిలో చేయబోతున్నట్టు తాజా సమాచారం. సుమారు లక్షకు పైగా అభిమానులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఎంత దూరం నుంచి చూస్తున్నా సరే మొహం దగ్గరికి వచ్చినంత స్పష్టంగా భారీ ఎల్ఈడి తెరలతో నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ కి రంగం సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల మాట.
ప్రత్యేకంగా ఫిలిం సిటీని ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. రామోజీరావుని జక్కన్న గురువుగా భావించడం తెలిసిందే. తన మొదటి దర్శకత్వపు వెంచర్ శాంతినివాసం టీవీ సీరియల్ నిర్మాత ఆయనే. అంతేకాదు బాహుబలి అధిక భాగం చిత్రీకరణ జరుపుకుంది అక్కడే. ఇప్పటికీ పలు సెట్లను అలాగే ఉంచి సందర్శకుల కోసం నిత్యం దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కొంత భాగం అక్కడే జరిగింది. సో సెంటిమెంట్ పరంగానూ రాజమౌళి ఇదే బెస్ట్ ప్లేస్ గా భావించారట. గతంలో ఈ వేదికలో జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మించిపోయేలా ఎస్ఎస్ఎంబి 29 లాంచ్ ఉంటుందని అంటున్నారు.
ప్రత్యేకంగా వేడుక లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ ని హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ఎంత మొత్తమనేది బయటికి రాలేదు కానీ ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమా ఈవెంట్ కి చెల్లించనంత మొత్తాన్ని ఇచ్చినట్టు వినికిడి. అలాని ఓటిటి హక్కులు అమ్మేసినట్టు కాదు. దానికి ఈ డీల్ కి ఎలాంటి సంబంధం లేదు. ఎస్ఎస్ఎంబి 29 డిజిటల్ పార్ట్ నర్ ఎవరో ఇంకా లాక్ కాలేదు. నెట్ ఫ్లిక్స్ అయితే ముందు వరసలో ఉంది. దీని సంగతలా ఉంచితే నిన్న రాత్రి మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంకా చోప్రా సరదాగా చేసుకున్న ట్విట్టర్ ఛాట్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. వివరాలు చెప్పకుండానే తెగ ఊరించేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates