కదిలించిన భీమ్స్ కన్నీటి గతం

మనిషన్నాక కష్టసుఖాలు సహజం. ఒక్కోసారి కొందరికి ఎందుకు బ్రతికి ఉన్నామానే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అయితే ప్రతిభను నమ్ముకుని, దేవుడి మీద భారం వేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అవకాశం, అదృష్టం తలుపు తడతాయని చరిత్ర ఎన్నోసార్లు ఋజువు చేసింది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో నిన్న జరిగిన మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పంచుకున్న అనుభవం వింటే ఇది నిజమే అనిపిస్తుంది. పదమూడేళ్ల క్రితం 2012లో ఇండస్ట్రీకి వచ్చిన భీమ్స్ కు అడపాదడపా గుర్తింపు తప్ప సరైన బ్రేక్ సంవత్సరాల తరబడి దొరకలేదు. దీంతో భార్యాపిల్లలను పోషించుకోవడం కష్టమైపోయింది.

ఒక దశలో ఫ్యామిలీతో పాటు ఈ లోకం వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు భీమ్స్. దాని కోసం ఒక సెల్ఫీ వీడియో కూడా తయారు చేసుకున్నాడు. అదే సమయంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి తనకో ఫోన్ కాల్ వచ్చింది కలవమని. అదే ధమాకా ఆఫర్. రవితేజ రికమండ్ చేసి మరీ ఆ ఛాన్స్ ఇప్పించడంతో భీమ్స్ సిసిరోలియో దశ మారిపోయింది. అందులో కంపోజ్ చేసిన పాటలు మాస్ లో విపరీతంగా బ్లాక్ బస్టర్ అయ్యాయి. వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం, చిరంజీవితో మన శంకరవరప్రసాద్ గారు చేసే గొప్ప అదృష్టాన్ని కలిగించాయి. అంతే ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.

రవితేజ వల్లే భీమ్స్ ఈ రోజు సగర్వంగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఆయన్ని దేవుడితో సమానంగా భావించి నిన్న పొగడ్తల వర్షం కురిపించాడు. మనదైన టైం కోసం ఓపిగ్గా ఎదురు చూస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో భీమ్స్ లైఫ్ కన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. మాస్ జాతరకు తను కంపోజ్ చేసిన సాంగ్స్ కన్నా ఎక్కువ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటారని ఇప్పటికే టాక్ ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొందరపడి ప్రతి సినిమాను ఒప్పుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తున్న భీమ్స్ మీసాల పిల్ల సాంగ్ తో సోషల్ మీడియాని ఊపేయడం చూస్తున్నాం.