ఇండియన్ సినిమా హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల లిస్టు తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు.. రాక్షసన్. విష్ణు విశాల్ హీరోగా రామ్ కుమార్ అనే కొత్త దర్శకుడు తమిళంలో రూపొందించిన చిత్రమిది. అమలా పాల్ హీరోయిన్. యుక్త వయసులో ఉన్న అమ్మాయిల మీద అఘాయిత్యాలకు పాల్పడి వారిని కిరాతకంగా చంపే సీరియల్ కిల్లర్ను పట్టుకునే పోలీస్ కథ ఇది.
హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గని రీతిలో.. ఆద్యంత తీవ్ర ఉత్కంఠ రేపుతూ సాగిన ఈ సినిమా థ్రిల్లర్ ప్రియులను ఉర్రూతలూగించింది. ఈ చిత్రాన్ని తర్వాత తెలుగులో రీమేక్ చేస్తే ఇక్కడా హిట్టయింది. ఆపై హిందీలో కూడా రీమేక్ చేశారు. దీనికి ముందు, తర్వాత ఇండియన్ సినిమాలో ఎన్నో అద్భుతమైన థ్రిల్లర్లు వచ్చినా.. ఇది చాలా స్పెషల్ అని చెప్పాలి.
ఐతే ఇప్పుడు విష్ణు విశాల్.. ‘ఆర్యన్’ అనే మరో సైకో థ్రిల్లర్ సినిమాతో రెడీ అయ్యాడు. దీని ట్రైలర్ చూసిన వాళ్లకు ‘రాక్షసన్’ గుర్తుకు వచ్చింది. ఒక హీరో నుంచి ఒక జానర్లో ఓ కల్ట్ మూవీ వచ్చాక.. తర్వాత అలాంటి ప్రయత్నమే చేస్తే ప్రమోషన్లలో గొప్పలు పోవడం ఖాయం. ముందు వచ్చిన సినిమాలాగే ఇదీ అలరిస్తుందని.. దాన్ని మించిన సినిమా అని చెప్పుకుంటూ ఉంటారు.
ఈ మధ్య మణిరత్నంతో కలిసి చేసిన ‘థగ్ లైఫ్’ గురించి కమల్ హాసన్ చెబుతూ తమ కలయికలో వచ్చిన ‘నాయకన్’ను మించిన సినిమా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. తీరా సినిమా చూస్తే తుస్సుమనిపించింది. ఐతే విష్ణు విశాల్ మాత్రం.. ‘ఆర్యన్’ గురించి అలా చెప్పట్లేదు. ప్రెస్ మీట్లో ‘రాక్షసన్’తో పోలిక గురించి అడిగితే.. అందరూ తనను ఇదే అడుగుతున్నారని.. కానీ తాము ‘రాక్షసన్’ స్థాయి సినిమా తీయలేదని నిజాయితీగా చెప్పాడు.
‘రాక్షసన్’ తమిళం అనే కాక ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీకీ థ్రిల్లర్ జానర్ విషయంలో ఒక రెఫరెన్సుగా నిలిచిపోయిందని.. అలాంటి మ్యాజిక్ను రీక్రియేట్ చేయడం సాధ్యం కాదని అతనన్నాడు. తాము కూడా అలా చేయలేమని.. ఐతే ‘రాక్షసన్’కు కొంచెం భిన్నంగా కొత్తగా ఒక మంచి థ్రిల్లర్ క్రియేట్ చేశామని చెప్పాడు విష్ణు విశాల్. ఈ సినిమా కూడా ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ను అందిస్తుందని అతనన్నాడు. సెల్వ రాఘవన్ ఇందులో విలన్ పాత్ర చేయగా.. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక పాత్ర చేసింది. విష్ణు ఇందులో కూడా పోలీస్ పాత్రే చేశాడు. ప్రవీణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్యన్’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates