విశాల్.. దీన్నయినా బయటికి తెస్తాడా?

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సహవాసం చేయడం తెలుగు వాడైన తమిళ హీరో విశాల్‌కు అలవాటే. అతను నడిగర్ సంఘంలోకి అడుగు పెట్టిన దగ్గర్నుంచే అందులో ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇక తనతో పని చేసే నిర్మాతలు, దర్శకులతో గొడవలు పెట్టుకుంటాడని కూడా విశాల్‌కు ఎప్పట్నుంచో పేరుంది. దీని వల్ల తన సినిమాలు ఇబ్బందుల్లో పడ్డ సందర్భాలున్నాయి.

తమిళంలో లెజెండరీ డైరెక్టర్‌గా పేరున్న మిస్కిన్‌తో విశాల్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. వీరి కలయికలో ‘తుప్పారివాలన్’ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. దాన్ని తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో రిలీజ్ చేస్తే ఇక్కడా విజయవంతమైంది. ఐతే తర్వాత ఇద్దరూ కలిసి ‘తుప్పారివాలన్-2’ను మొదలుపెట్టారు. కానీ విశాల్, మిస్కిన్ మధ్య గొడవ జరిగి సినిమా మధ్యలో ఆగింది. మిస్కిన్ తప్పుకున్నాక విశాలే ఈ చిత్రాన్ని టేకప్ చేశాడు. స్వీయ దర్శకత్వంలో సినిమా పూర్తి చేయాలని చూశాడు. కానీ కుదరలేదు. కొన్నేళ్ల నుంచి సినిమా గురించి అప్‌డేట్ లేదు. ఇక ‘తుప్పారివాలన్-2’ బయటికి రాదని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు.

కట్ చేస్తే ఇప్పుడు విశాల్ కొత్త చిత్రం ‘మకుటం’ కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. ఈ చిత్రం రవి అరసు దర్శకత్వంలో మొదలైంది. సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ జరిగినపుడు కూడా అతనే దర్శకుడు. కానీ ఇప్పుడు వ్యవహారం మారిపోయింది. రవి అరసు సినిమా నుంచి తప్పుకున్నాడు. విశాల్ డైరెక్టర్ చైర్‌లోకి వచ్చాడు. విశాలే దర్శకత్వ బాధ్యతల్లోకి వెళ్లినట్లు కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం నిజమే అని తేలిపోయింది. తాను దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నట్లు స్వయంగా విశాలే ప్రకటన చేశాడు.

ఇది బాధ్యతతో, నిర్మాత సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయమని అతను వెల్లడించాడు. ఐతే గతంలో ‘తుప్పారివాలన్-2’ను టేకప్ చేసి ఆ సినిమాను ఎటూ కాకుండా చేశాడు విశాల్. ఈ నేపథ్యంలో ‘మకుటం’ అయినా పూర్తవుతుందా.. లేక ఇదీ అటకెక్కేస్తుందా అనే చర్చ జరుగుతోంది. విశాల్ వల్ల గతంలో పలువురు దర్శకులు దెబ్బ తిన్నారని.. ఇప్పుడు రవి అరసు ఆ జాబితాలో చేరాడని.. తన స్క్రిప్టు తీసుకుని ఇప్పుడు విశాల్ ఏం చేస్తాడో చూడాలంటూ తన పట్ల సామాజిక మాధ్యమాల్లో చాలామంది నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు.