థియేటర్, ఓటిటి మధ్య గ్యాప్ ఎనిమిది వారాలు ఉండాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. బాలీవుడ్ మల్టీప్లెక్సులు ఈ కండీషన్ పాటిస్తేనే సినిమాలు వేసుకుంటామని నిర్మాతలకు ఖరాఖండీగా చెప్పడమే కాదు అగ్రిమెంట్లు కూడా చేయించుకోవడంతో కనీసం యాభై రోజుల నిడివి లేనిదే హిందీ మూవీస్ డిజిటల్ లో రావడం లేదు. మలయాళంలో దాదాపు చాలా మంది ఫిలిం మేకర్స్ దీనికి కట్టుబడి ఉన్నారు. లోక చాప్టర్ 1 అందుకే చాలా ఆలస్యంగా బుల్లితెరపై వస్తోంది. కానీ ఇది తెలుగు, తమిళ ప్రొడ్యూసర్లలో చాలా మంది పాటించలేకపోతున్నారు. హక్కుల సొమ్ము కోసం టెంప్ట్ అయిపోయి 28 రోజులకు సై అంటున్నారు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. ఎందుకంటే ఇంత నిడివి ఉందంటే ఎక్కువ థియేటర్ రెవిన్యూకు దోహదం చేస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనీసం నలభై రోజులు మంచి ఆక్యుపెన్సీలు వస్తాయి. పుష్ప 2 ది రూల్, కల్కి 2898 ఏడి లాంటివి ఈ స్ట్రాటజీనే ఫాలో అయ్యి మంచి ఫలితాలు అందుకున్నాయి. హనుమాన్ సైతం స్పెషల్ రిక్వెస్ట్ మీద యాభై అయిదు రోజుల తర్వాత కానీ స్మార్ట్ స్క్రీన్ మీదకు రాలేదు.
అలాని అందరూ ఇలాగే ఉన్నారని కాదు. సలార్, గుంటూరు కారం నుంచి ఇప్పటి ఓజి దాకా చాలా పెద్ద సినిమాలు కేవలం ఫోర్ వీక్ విండోకి జై కొట్టినవే. ఇది మారాలని బయ్యర్లు కోరుకుంటున్నారు. చిన్న బడ్జెట్ సినిమాలకు ఈ కండీషన్ అక్కర్లేదు. కంటెంట్ బాగుంటే రికవరీ త్వరగా అయిపోతుంది. లిటిల్ హార్ట్స్ ముప్పై కోట్లు లాగేసి సరిగ్గా నెలకు ఈటీవీ విన్ లో వచ్చేసింది. కానీ పెద్ద సినిమాల లైఫ్ అలా కాదు. ఎక్కువ కాలం థియేటర్ రన్ జరగాలి. అప్పుడే ఎగ్జిబిషన్ రంగం లాభాల్లో ఉంటుంది. మరి డ్రాగన్ తరహాలో మిగిలినవి కూడా రాబోయే రోజుల్లో కనీసం యాభై రోజుల గ్యాప్ పెట్టుకోవడం అత్యవసరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates