వంశీ పైడిపల్లి… తగ్గేదే లే

కొందరు దర్శకులు స్టార్ ఇమేజ్ సంపాదించినా సరే.. ప్రతిసారీ సినిమా స్థాయిని చూసుకోకుండా అందుబాటులో ఉన్న హీరోతో సినిమా చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. ఫలానా హీరోనే కావాలి, సినిమా అంటే ఒక రేంజ్ ఉండాలి అని ఆలోచించరు. కానీ కొందరు దర్శకులు మాత్రం ఈ విషయంలో పర్టికులర్‌గా ఉంటారు. 

కెరీర్లో గ్యాప్ వచ్చినా పర్వాలేదు.. టైం వేస్టయినా ఓకే.. చేస్తే భారీ చిత్రమే చేయాలి, టాప్ హీరోలతోనే జట్టు కట్టాలి అని ఫిక్సయిపోయి ఉంటారు. వంశీ పైడిపల్లి ఆ కోవకే చెందుతాడు. తొలి సినిమా ‘మున్నా’ ఫ్లాప్ అయినా సరే.. అతను అగ్రశ్రేణి కథానాయకులతోనే సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్లో టాప్ స్టార్స్ అందుబాటులో లేదంటే ఇంకో ఇండస్ట్రీకి వెళ్తున్నాడు తప్ప.. మిడ్ రేంజ్ సినిమాలే చేయట్లేదు. 

‘మహర్షి’ తర్వాత మహేష్‌తో చేయాల్సిన మరో సినిమా క్యాన్సిల్ అయినా నిరాశ చెందకుండా వెయిట్ చేసి తమిళ నంబర్ వన్ హీరో విజయ్‌తో ‘వారిసు’ తీశాడు వంశీ. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడగా.. తర్వాతి సినిమాకు మళ్లీ గ్యాప్ వచ్చింది. తర్వాత అతడి చూపు బాలీవుడ్ మీద పడ్డట్లు తెలుస్తోంది. ఆమిర్‌ ఖాన్‌తో సినిమా అన్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అలా అని అతను ముంబయి వదిలి వచ్చేయలేదు. ఇంకో అగ్ర కథానాయకుడు సల్మాన్ తలుపు తట్టాడు. కొంత కాలంగా ఆయనతో కథా చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు సినిమా ఓకే అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

వంశీ అంటే దిల్ రాజు ఆస్థాన దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా రాజే ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. ‘వారిసు’ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా సరే.. రాజుకు లాభాలే వచ్చాయి. దీంతో వంశీ తర్వాతి సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఆయన రెడీగా ఉన్నాడు. సల్మాన్ మార్కెట్ కొంత దెబ్బ తిన్నా సరే అంత పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవకాశాన్ని దిల్ రాజు వదులుకునే అవకాశం లేదు. మరి ఈ సినిమా అయినా పక్కాగా ఉంటుందా.. దీని గురించి ప్రకటన వస్తుందా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.