కీర్తి సురేష్ ఈజ్ బ్యాక్

పరభాషా నటి అయినా అలాంటి ఫీలింగ్ ఏమీ కనిపించనివ్వకుండా.. మన వాళ్లు సొంత అమ్మాయిలా ఓన్ చేసుకున్న నటి కీర్తి సురేష్. కెరీర్ ఆరంభంలో ఆమె అందరు హీరోయిన్లలో ఒకరిలాగే కనిపించింది కానీ.. ‘మహానటి’ మూవీతో మొత్తం మారిపోయింది. సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన కీర్తి.. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిపోయింది. ఇక అప్పట్నుంచి కీర్తి ఏ సినిమా చేసినా ఆమె కోసమే ప్రేక్షకులు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. 

కానీ ‘మహానటి’ తర్వాత ఆ స్థాయిలో ఆమె మెప్పించిన సినిమాలు తక్కువే. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీసే చేస్తూ వచ్చిన కీర్తి.. స్టార్ హీరోల సరసన సర్కారు వారి పాట, దసరా లాంటి చిత్రాల్లోనూ మెరిసింది. ఒక టైంలో తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చిన కీర్తి.. రెండేళ్లుగా టాలీవుడ్ మీద పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు. ‘భోళా శంకర్’లో చిరు చెల్లెలి పాత్రలో నటించిన ఆమెకు చేదు అనుభవం తప్పలేదు. ఆ తర్వాత తెలుగులో తన చిత్రమేదీ థియేటర్లలో విడుదలే కాలేదు. ‘ఉప్పు కప్పురంబు’ అనే సినిమా చేసినా.. అది ఓటీటీలో రిలీజై నిరాశపరిచింది.

తెలుగులో ఒక క్రేజీ మూవీలో కథానాయికగా కీర్తి నటిస్తే చూడాలని కోరుకుంటున్న అభిమానులకు ఎట్టకేలకు ఆ ఆశ తీరింది. స్టార్ హీరో, మంచి పెర్ఫామర్‌గా పేరున్న విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి కనిపించబోతోంది. ఎప్పట్నుంచో వార్తల్లో ఉన్న ‘రౌడీ జనార్దన’ ఎట్టకేలకు మొదలైంది. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘రాజావారు రాణివారు’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఫేమ్ రవికిరణ్ కోలా రూపొందించనున్నాడు. 

ఓ మంచి హిట్ కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న విజయ్.. ఈ చిత్రం మీద చాలా ఆశలతో ఉన్నాడు. విజయ్, కీర్తి ఇంతకుముందు ‘మహానటి’లో నటించినా.. అందులో వాళ్లిద్దరి కాంబినేషన్లో సీన్లు ఉండవు. ఇప్పుడు ఇద్దరూ కలిసి నటిస్తుండడం ఇరువురి అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచుతోంది. ఇది మంచి పెయిర్ అవుతుందనే అంచనాలున్నాయి. మరి టాలీవుడ్ రీఎంట్రీలో కీర్తికి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.