ఇడ్లీలు… అక్కడ వేడిగా ఇక్కడ చల్లగా

రేపు ధనుష్ ఇడ్లి కొట్టు విడుదలవుతోంది. తెలుగులో సౌండ్ లేదు. మొన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసుకున్నప్పటికీ కరూర్ విషాదంలో నలభై మంది ప్రాణాలు కోల్పోవడంతో దానికి నివాళిగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. టైం తక్కువగా ఉండటంతో మళ్ళీ ప్రమోషన్లు చేసే అవకాశం లేకపోయింది. మాములుగా ధనుష్ తెలుగు వెర్షన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. సార్, రాయన్, కుబేర టైంలో చాలా యాక్టివ్ గా పబ్లిసిటీ చేసుకున్నాడు. కానీ ఇడ్లి కొట్టు విషయంలో ఆ ఛాన్స్ దొరకడం లేదు. దీంతో ఏపీ తెలంగాణ జనాల్లో పెద్దగా బజ్ కనిపించడం లేదు. ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ నామమాత్రంగా ఉన్నాయి.

తమిళనాడులో ఇడ్లి కడైగా విడుదలవుతున్న ఈ ఎమోషనల్ డ్రామాకు ముందస్తు టికెట్ల అమ్మకాలు బాగానే ఊపందుకుంటున్నాయి. సగటున గంటకు పదిహేను వందల నుంచి రెండు వేల దాకా టికెట్లు అమ్ముడుపోవడం మంచిదే. కానీ తెలుగులో కనీసం ట్రెండింగ్ లోకి రాలేదు. నేటివిటీ సమస్య వల్ల టాలీవుడ్ జనాలు వేగంగా కనెక్ట్ కాలేకపోతున్నారనేది సోషల్ మీడియా ట్రెండ్స్ ని బట్టి చెప్పొచ్చు. కథంతా అరటిపండు వలిచినట్టు చెప్పేయడంతో టాక్ వచ్చాక చూద్దాం లెమ్మనే జనాలు ఎక్కువగా ఉంటారు. పైగా ఒక రోజు గ్యాప్ తో కాంతార చాప్టర్ 1 రిలీజ్ కానుండటం కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ప్రభావం చూపిస్తోంది.

స్వీయ దర్శకత్వంలో ఇడ్లి కొట్టు తీసిన ధనుష్ ఈసారి కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ఉన్నాడు. పల్లెటూరు, ఇడ్లిలు అమ్ముకునే ఒక చిన్న కుటుంబం, అందమైన భావోద్వేగాలు, గ్రామీణ మట్టి వాసన, కల్లాకపటం లేని అనుబంధాలు ఇలా పూర్తిగా క్లాస్ సైడ్ వెళ్ళిపోయాడు. కంటెంట్ పరంగా చాలా గట్టి నమ్మకమే చూపిస్తున్నాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చిన ఇడ్లి కొట్టులో ‘సాహో’ అరుణ్ విజయ్ విలన్ గా నటించగా సత్యరాజ్, పార్తీబన్, అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మరోసారి పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్రలో నిత్య మీనన్ హీరోయిన్ గా చేసింది.