హిందీ సీరియల్స్, టీవీ షోలతో గుర్తింపు సంపాదించిన రాజస్థానీ నటి సోహానీ కుమారి కాబోయే భర్త సవాయి సింగ్ హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్లో సవాయ్ తన సొంత ఫ్లాట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. అతడి వయసు 28 ఏళ్లు. ఫ్లాట్లోని డైనింగ్ ఏరియాలో అతను ఉరివేసుకుని కనిపించడంతో బయటి నుంచి వచ్చి చూసిన సోహానీ షాక్కు గురైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సోహానీ ఉత్తరాది నటే అయినా.. ఆమె హైదరాబాద్లోనే ఉంటోంది. కాబోయే భర్త మరణంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది.
ఆత్మహత్యకు ముందు సవాయి సింగ్ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జీవితాన్ని ముగించాలనే తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితుల గురించి అందులో అతను వివరించాడు. గతంలో తాను చేసిన తప్పులే తనకు ఈ పరిస్థితి రావడానికి కారణమని అతనుపేర్కొన్నాడు. తనకంటే ముందు సవాయ్కి మరో యువతితో ప్రేమ వ్యవహారం ఉందని, ఆమెను మరిచిపోలేకపోవడంతో పాటు కొన్ని ఆర్థిక సమస్యల కారణంగానే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని సోహానీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.
రాజస్థాన్కు చెందిన సోహానీ కుమారి, సవాయ్ సింగ్లకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది తర్వాత ప్రేమగా మారడంతో, పెద్దల అంగీకారంతో గత ఏడాది జులైలో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్లోని ఒక ఫ్లాట్లో అద్దెకు ఉంటున్నారు. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. ఇంతలో సవాయ్ ఆత్మహత్యకు పాల్పడడం సోహానీకి షాక్. సోహానీ కుమారి హిందీ సీరియల్స్ ద్వారా నటిగా పేరు సంపాదించింది. వాటిలో ‘యే హై చాహతే’ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. సోహానీ ఇటీవలే నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ‘ప్యార్ టెస్టింగ్స పేరుతో ఆమె ఒక సిరీస్ నిర్మిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates