పాపం ఖుషి… ఇలా అయ్యిందేంటి

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కున్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కొత్త సినిమా, పాత రీ రిలీజ్ ఏదైనా అభిమానుల సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. ఒక్కడు రీమేక్ గిల్లి ఇప్పటిదాకా వచ్చిన రీ రిలీజుల్లో నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తోంది. మూడు కోట్లకు పైగా మొదటి రోజు గ్రాస్ తో మొన్నటి ఏడాది బయ్యర్ల మతులు పోగొట్టింది. విజయ్ లిస్టులో యావరేజ్ గా అనిపించే సచిన్ సైతం కోటి డెబ్భై ఆరు లక్షలతో రెండో స్థానంలో ఉంది. అలాంటిది ఖుషి ఇంకెలాంటి రికార్డులు బద్దలు కొడుతుందోనని ఆశించడం సహజం. నిర్మాత ఏఎం రత్నం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొత్త ప్రింట్ తో ఖుషిని థియేటర్లకు తీసుకొచ్చారు.

తీరా చూస్తే ఖుషి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోలేదని కోలీవుడ్ ట్రేడ్ టాక్. డెబ్భై లక్షల దాకా గ్రాస్ వసూలయ్యిందని చెబుతున్నారు. అంటే సచిన్ కన్నా చాలా తక్కువ. బాబా, దీనా, బిల్లా కన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ గిల్లిని దాటుతుందని భావించిన ఫ్యాన్స్ కోరిక నెరవేరలేదు. పవన్ కళ్యాణ్ ఖుషి దీని రీమేకన్న సంగతి తెలిసిందే. అప్పట్లో రెండు ఒకేసారి తీయాలనుకున్నారు. ఆ మాటకొస్తే ముందు పవన్ వెర్షన్ అయ్యాక విజయ్ ది తీయాలని ప్లాన్. కానీ రకరకాల కారణాల వల్ల మార్చుకున్నారు. రెండు భాషల్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాగా ఖుషి పేరు మీద ఎన్నో మైలురాళ్లున్నాయి.

తెలుగు ఖుషి రీ రిలీజ్ చేసినప్పుడు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. కానీ తమిళంలో ఇలా జరగడం విచిత్రం. విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్న నేపథ్యంలో అతనికి సంబంధించిన సినిమాల సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని విశ్లేషకులు భావించారు. కానీ ఖుషికి అలా జరగలేదు. జనవరి 9 విడుదల కాబోతున్న జన నాయకుడు ఏం చేస్తుందనే దాని మీద ట్రేడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పొలిటికల్ గా యాక్టివ్ కావడంతో విజయ్ కు దాని తాలూకు సెగలు వివిధ రూపాల్లో తగులుతున్నాయి. జన నాయకుడులో సున్నితమైన అంశాలు చాలానే టచ్ చేశారని అంటున్నారు. వివాదాలు అయ్యే ఛాన్స్ లేకపోలేదు.