96 సినిమాతో దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించాడు తమిళ సినిమాటోగ్రాఫర్ ప్రేమ్ కుమార్. అది తమిళ సినీ చరిత్రలోనే అత్యుత్తమ ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దాని తర్వాత ప్రేమ్ చాలా టైం తీసుకుని ‘మెయ్యళగన్’ అనే మరో హృద్యమైన సినిమా తీశాడు. ఇది కూడా గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తెలుగులో ‘సత్యం సుందరం’ పేరుతో రిలీజై ఇక్కడా అప్లాజ్ తెచ్చుకుంది.
ఐతే ఈ సినిమా కమర్షియల్గా అనుకున్నంత విజయం సాధించకపోవడం పట్ల దర్శకుడు ప్రేమ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా ఆర్థికంగా ఆశించిన విజయం సాధించకపోవడానికి కారణం రివ్యూయర్లే అంటూ ఆయన మండిపడ్డాడు. తమిళంలో పైరసీ కంటే రివ్యూయర్లే ప్రమాదం అంటూ.. వాళ్ల మీద ప్రేమ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలే చేశాడు. దీంతో తమిళ సమీక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
‘‘మెయ్యళగన్ సినిమాకు రావాల్సిన పేరు వచ్చింది. ఓటీటీలో రిలీజయ్యాక అందరూ కొనియాడారు. మాకు మంచి గుర్తింపే వచ్చింది. కానీ కమర్షియల్గా మేం అనుకున్నంత సక్సెస్ కాలేదు. అందుక్కారణం.. రివ్యూయర్లే. సినిమా బాగుంది అంటూనే ఫలానా సన్నివేశం అవసరం లేదు, ల్యాగ్ ఉంది అంటూ నెగెటివ్ కామెంట్లు చేశారు. వాళ్లకు ఎలాంటి సినిమానైనా ఏదో ఒకటి అనాలి. ఇందుకు వాళ్లకు డబ్బులు ఇస్తారు. వాళ్ల ప్రయోజనాలు వాళ్లవి. ఇది పైరసీ కంటే పెద్ద సమస్యగా మారింది. ఎంత మంచి సినిమా తీసినా.. వాళ్ల చేతుల్లో పడి నలిగిపోతోంది.
ఒక సీనియర్ దర్శకుడి గురించి రివ్యూయర్లు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్లకు మానసిక అనారోగ్యం ఉందని భావిస్తాను. సినిమాల ప్రి రిలీజ్ ప్రమోషన్లప్పుడు ఫిలిం మేకర్స్.. తమ సినిమా గురించి చూసి రాయాలని రివ్యూయర్లను వేడుకుంటున్నారు. ఇలా జరగకూడదు. మనం నేరుగా ప్రేక్షకులతో కనెక్షన్ ఏర్పరుచుకోవాలి. నాకు రివ్యూయర్లంటే భయం లేదు. అందుకే ఇవన్నీ మాట్లాడుతున్నా’’ అని ప్రేమ్ పేర్కొన్నాడు.
ఐతే ఈ వ్యాఖ్యలపై తమిళ రివ్యూయర్లు మండిపడుతున్నారు. ఈ సినిమాకు అందరూ పాజిటివ్ రివ్యూలే ఇచ్చారని.. సినిమాలో సమస్యల గురించి ప్రస్తావించడం తప్పా.. అయినా ‘లబ్బర్ పందు’ సినిమా వల్ల ‘మెయ్యళగన్’ అనుకున్నంతగా ఆడలేదు తప్ప, అందులో రివ్యూయర్ల ప్రమేయం ఏముంది అంటూ ప్రశ్నిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates