దిల్‍ రాజుకి ఝలక్‍ ఇచ్చిన వరుణ్‍ తేజ్‍!

ఎఫ్‍ 2 చిత్రాన్ని సైన్‍ చేసినప్పటికే వరుణ్‍ తేజ్‍కి కొన్ని హిట్లున్నాయి కానీ అప్పుడు వెంకటేష్‍తో కలిసి నటించడానికి వరుణ్‍ తేజ్‍ పెద్దగా ఆంక్షలేమీ పెట్టలేదు. దిల్‍ రాజు ఇస్తానని చెప్పినంత పారితోషికమే తీసుకున్నాడు. పాత్ర పరంగా ఎలాంటి డిమాండ్లు కూడా చేయలేదు. కానీ ఇప్పుడా సినిమా సీక్వెల్‍కి మాత్రం వరుణ్‍ తేజ్‍ తగ్గేది లేదంటున్నాడట. ఈసారి తన పారితోషికం భారీగా పెంచేసి అడుగుతున్నాడట. అలాగే పాత్ర పరంగా తనకు సమాన ప్రాధాన్యం వుండాలని చెప్పాడట.

వరుణ్‍ తేజ్‍ ఇప్పుడిలా పట్టుబట్టడంతో దిల్‍ రాజు దీనిని ఎలా తెగ్గొట్టాలా అని చూస్తున్నాడట. ఎఫ్‍ 2 చిత్రానికి దిల్‍ రాజుకి ముప్పయ్‍ కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. సీక్వెల్‍ అంటే తప్పకుండా క్రేజ్‍ భారీ స్థాయిలో వుంటుంది కనుక ఈసారి వరుణ్‍ అయినా, వెంకటేష్‍ అయినా తక్కువకు సర్దుకుపోయే అవకాశం లేదు. అలాగే అనిల్‍ రావిపూడికి కూడా మునుపటి కంటే అధిక పారితోషికం ఇవ్వక తప్పదు.

అప్పుడు ముప్పయ్‍ కోట్ల లోపు బడ్జెట్‍లో రూపొందిన ఎఫ్‍ 2కి ఈసారి కనీసం యాభై నుంచి అరవై కోట్లు ఖర్చు పెట్టక తప్పదంటున్నారు. కరోనా సాకు చూపించి బడ్జెట్‍ పరంగా కోతలు విధించాలని చూస్తోన్న దిల్‍ రాజుకి ఈ చిత్రం విషయంలో ఆ రాయితీలు వచ్చేట్టు లేవు.