సినిమాలో జంటగా నటిస్తూ.. ఆ క్రమంలో ప్రేమలో పడ్డ జంటలు ఎన్నెన్నో. అందులో కొందరు తమ ప్రేమ బంధాలను పెళ్లి వరకు తీసుకెళ్తారు. కొందరేమో.. మధ్యలో విడిపోయి ఎవరి దారి వారు చూసుకుంటారు. ఈ మధ్య బాలీవుడ్లో పెద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన ‘సైయారా’ సినిమాలో జంటగా నటించిన అహాన్ పాండే, అనీత్ పడ్డా సైతం ప్రేమలో పడ్డట్లు బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘సైయారా’లో నటించే సమయానికి వీరి గురించి సామాన్య జనానికి పెద్దగా తెలియదు. ఐతే పెద్దగా అనుభవం లేకపోయినా.. ‘సైయారా’లో అహాన్, అనీత్ అద్భుతంగా నటించి మెప్పించారు. వాళ్లిద్దరి కెమిస్ట్రీ చూస్తే.. నిజంగానే వారు ప్రేమికులా అనిపించేంతగా ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. ఐతే ఇదంతా నిజంగా ప్రేమలో ఉండబట్టే సాధ్యమైందని అంటున్నారు.
‘సైయారా’లో నటించేటపుడే అహాన్, అనీత్ ప్రేమలో పడ్డారట. నిజ జీవితంలో ఇద్దరి మధ్య ఉన్న బాండింగే తెర మీద కూడా ప్రతిబింబించిందట. నిర్మాత యశ్ చోప్రాకు ఈ విషయం తెలిసినప్పటికీ.. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో ఈ విషయం బహిర్గతపరచొద్దని హెచ్చరించాడట. అందుకే ఇప్పటిదాకా అధికారికంగా తమ రిలేషన్షిప్ గురించి అహాన్, అనీత్ బయటపెట్టలేదని ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనంలో పేర్కొన్నారు.
అహాన్, అనీత్లకు ‘సైయారా’ రిలీజ్ తర్వాత అవకాశాలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. వాటిని ఒప్పుకునే స్థితిలో లేరు. ‘సైయారా’ సక్సెస్ను ముందే ఊహించిన యశ్ చోప్రా.. తన సంస్థలోనే మూడు సినిమాల చొప్పున నటించేలా వీరితో ఒప్పందం చేసుకున్నాడు. అవి పూర్తయ్యాకే వేరే సినిమాల వైపు చూడబోతున్నారు అహాన్, అనీత్.
Gulte Telugu Telugu Political and Movie News Updates