పవన్ కళ్యాణ్ కెరీర్ లో యూత్ ఫాలోయింగ్ అమాంతం పెంచిన సినిమాల్లో బద్రిది ప్రత్యేక స్థానం. పూరి జగన్నాథ్ అనే పవర్ హౌస్ ని పరిచయం చేసింది కూడా ఈ మూవీనే. కహో నా ప్యార్ హైతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్లాక్ బస్టర్ లో భాగమైన హీరోయిన్ అమీషా పటేల్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చింది బద్రి. ఇంత గొప్ప విజయం అందుకున్నాక కూడా అమీషా ఎక్కువ చిత్రాలు చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ నరసింహుడు, మహేష్ బాబు నాని, బాలకృష్ణ పరమవీరచక్ర చేసింది కానీ అన్నీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్స్ అయ్యాయి. 2017 ఆకతాయిలో అనే చిన్న మూవీలో చివరిసారి కనిపించింది.
ఇప్పుడు అమీషా పటేల్ వయసు 50 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. ఎందుకు చేసుకోలేదంటే సరైన వ్యక్తి దొరక్కపోవడంతో పాటు నటనకు స్వస్తి చెప్పమనే వాళ్లే ఎక్కువ తగలడంతో వివాహ బంధానికి దూరంగా ఉన్నానని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయినా హీరోలు ఎంత లేట్ ఏజ్ అయినా జనాలు ఓకే అంటారు కానీ ఇలా అర్ధ శతాబ్దపు వయసుకొచ్చిన అమీషా లాంటి వాళ్ళను ఇంకా కథానాయకిగా చూడాలని అనుకోరు. గదర్ 2 రూపంలో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈమెకు తర్వాత తౌబా తేరే జాల్వా అనే సినిమా సూపర్ ఫ్లాప్ గా నిలిచి అవకాశాలకు బ్రేక్ వేసింది.
ఇప్పటికైనా మించిపోయింది లేదని సరైన భాగస్వామి దొరికితే పెళ్ళికి రెడీ అంటున్న అమీషా పటేల్ కు చాలా మంది డేటింగ్ ఆఫర్స్ ఇచ్చారట. తన కన్నా వయసులో సగం చిన్నవాళ్లు కూడా ప్రేమించమని వెంటపడ్డారని, కానీ నాకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. గతంలో ఒక నటుడిని సిన్సియర్ గా లవ్ చేస్తే అతనేమో సినిమాలు మానేయాలనే కండీషన్ పెట్టడం వల్లే దూరం చేసుకున్నానని ఎమోషన్ అయ్యింది. ఇదంతా బాగానే ఉంది కానీ ఏదో కంటిన్యూ గా ఫామ్ లో ఉంటే ఏదో అనుకోవచ్చు కానీ మూడు నాలుగేళ్ళకో సినిమా చేస్తున్న అమీషా పటేల్ నిజంగా కెరీర్ ని అంత సీరియస్ గా తీసుకుంటోందా.
Gulte Telugu Telugu Political and Movie News Updates