‘ఈగల్-2’ ఉందంటున్న నిర్మాత

ఒక ఫ్లాప్ సినిమాకు ఎవ్వరైనా సీక్వెల్ తీయాలని అనుకుంటారా? రెండు భాగాలుగా తీయాలనుకున్న సినిమాకు కొంత షూటింగ్ చేసి ఉంటే ఆలోచిస్తారేమో కానీ.. అలా కాని పక్షంలో అయితే మాత్రం సీక్వెల్ చర్చే ఉండదు. కానీ పీపుల్ మీడియా అధినేత టి.జి.విశ్వప్రసాద్ మాత్రం తన బేనర్లో వచ్చిన ఒక ఫ్లాప్ చిత్రానికి సీక్వెల్ చేయాలనుకుంటున్నారు. ఆ చిత్రమే.. ఈగల్. రవితేజ హీరోగా యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ చిత్రం గత ఏడాది ఫిబ్రవరిలో భారీ అంచనాల మధ్య రిలీజై నిరాశపరిచింది.

ప్రోమోలు చూసి ఏదో ఊహించుకున్న ప్రేక్షకులకు ఈ సినిమా పెద్ద షాకే ఇచ్చింది. వీకెండ్లో కూడా సరిగా నిలబడలేకపోయిన ఈ చిత్రం.. తర్వాత పూర్తిగా చల్లబడిపోయింది. ఐతే సినిమా సరిగా ఆడకపోయి ఉండొచ్చు కానీ.. కంటెంట్ పరంగా ఇది తీసి పడేసే సినిమా కాదని అంటున్నారు విశ్వప్రసాద్. ఈగల్-2 తీయడంపై సీరియస్‌గానే ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్తీక్ ఈ సినిమాను బాగానే తీసినా.. పొజిషనింగ్ సరిగా లేదని.. స్క్రీన్ ప్లేలో కొంచెం మార్పులు ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈగల్ క్లైమాక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని.. ఆ విషయంలో రెండో మాట లేదని ఆయనన్నారు. అందుకే సీక్వెల్ తీయడం గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. థియేటర్లలో ఈ సినిమా ఉన్నంతలో బాగానే ఆడిందని.. అమ్మిన రేట్లతో పోలిస్తే నాలుగైదు కోట్ల నష్టమే వచ్చిందని ఆయన చెప్పారు. ఐతే ఒక మిస్ మేనేజ్మెంట్ వల్ల ‘ఈగల్’ సినిమాకు డిజిటల్ డీల్ ఓకే కాలేదని.. దాని వల్ల ఈ సినిమా ఓవరాల్‌గా పెద్ద నష్టం తెచ్చిపెట్టిందే తప్ప, ఓటీటీ అయి ఉంటే తమకు సినిమా సక్సెస్ ఫుల్‌ ప్రాజెక్టుగా నిలిచేదని ఆయనన్నారు.