కాంతారకు భలే చిక్కొచ్చి పడింది

అక్టోబర్ 2 విడుదల కాబోతున్న కాంతార చాప్టర్ 1 ది లెజెండ్ ఇప్పటిదాకా ప్రమోషన్లు మొదలుపెట్టకపోవడం పట్ల ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి దీని కోసమే ముంబై, బెంగళూరు ట్రిప్పులు కొడుతూ బిజీగా ఉన్నాడు. కెజిఎఫ్ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని శాండల్ వుడ్ మీడియా అంచనా వేస్తోంది. అయితే ఊహించని ఒక ఆటంకం నిర్మాణ సంస్థకు గుదిబండలా మారింది. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలోని మల్టీప్లెక్సుల టికెట్ రేట్లు గరిష్టంగా 236 రూపాయలకు పరిమితం చేస్తూ జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కన్నడ సీమలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.

హోంబాలే ఫిలిమ్స్ దీని మీద కోర్టుకు వెళ్లినట్టుగా లేటెస్ట్ అప్డేట్. తాము పెట్టిన బడ్జెట్ రికవర్ కావాలంటే సవరించిన ధరలు సరిపోవని, తమ ప్రతిపాదనను పరిశీలించి ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారట. అంతే కాదు కన్నడలో తీసిన సినిమాకు స్వంత రాష్ట్రంలో తక్కువ రేట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఎక్కువగా ఉండటం ఏ మాత్రం సముచితం కాదని పేర్కొంటూ తమ వైపు వర్షన్లను న్యాయవాదితో వినిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుందట. ఎందుకంటే జీవో ప్రకారం ఫాలో అయితే కాంతార చాప్టర్ 1 ఏ రకంగానూ కెజిఎఫ్ దరిదాపుల్లోకి వెళ్ళలేదు.

ఒకవేళ హోంబాలేకు అనుకూలంగా తీర్పు వస్తే ఇతర ప్రొడ్యూసర్లు ధీమాగా ఉంటారు. ప్రతికూలంగా వస్తే మాత్రం బాక్సాఫీస్ రికార్డులను ఆశించడం దుర్లభం అవుతుంది. వచ్చే ఏడాది యష్ టాక్సిక్ వస్తోంది. దీని మీద కాంతార కంటే రెండింతలు ఎక్కువ బడ్జెట్ అవుతోంది. కానీ కాంగ్రెస్ సర్కారు రేట్లు పెంచేది లేదని మొండిపట్టు పడితే అప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ రేట్లకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ సమస్య వల్లే పబ్లిసిటీ మీద కాంతార టీమ్ పూర్తి స్థాయి దృష్టి పెట్టలేకపోతోందని వినికిడి. గాంధీ జయంతి, దసరా పండగలను లక్ష్యంగా పెట్టుకున్న కాంతార వెయ్యి కోట్ల గ్రాస్ ఆశిస్తోంది.