కర్ణాటకలో టికెట్ల రేట్లు.. కండిషన్స్ అప్లై

రెండు నెలల కిందట కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఏ సినిమాకైనా సరే.. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.200కు మించకూడదంటూ జీవో ఇచ్చింది. దక్షిణాదిన టికెట్ల ధరలు అధికంగా ఉండే నగరాల్లో బెంగళూరు ఒకటి. అక్కడ మల్టీప్లెక్సుల్లో ఫ్లెక్సీ ప్రైసింగ్ అమల్లో ఉండేది. అంటే డిమాండును బట్టి ఎంతైనా రేటు పెంచుకుంటారన్నమాట. ఈ ప్రకారం కొన్ని సినిమాలకు రూ.800 నుంచి 1000 వరకు కూడా రేటు పెట్టేవాళ్లు. మల్టీప్లెక్సుల్లో క్రేజున్న పెద్ద సినిమాలకు 400 మించి రేటు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది.

ఐతే దీని మీద జనం నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం రూ.200 క్యాప్ పెడుతూ జీవో ఇచ్చింది. ఐతే అది వెంటనే అమల్లోకి రాలేదు. తాజాగా నిర్ణయం కార్యరూపం దాల్చింది. ఐతే ట్యాక్సులతో కలిపి అక్కడ మల్టీప్లెక్స్‌లో గరిష్ట రేటు రూ.236గా మారింది. సింగిల్ స్క్రీన్లయినా, మల్టీప్లెక్సులైనా బెంగళూరులో ఇక ఏ సినిమాకు రేటు రూ.236కు మించదు. రిక్లైనర్స్ సీట్లు అయినా దీనికి మించి రేటు పెట్టడానికి వీల్లేదు. అలా అని పూర్తిగా అన్ని మల్టీప్లెక్సులూ దీని పరిధిలోకి వస్తాయా అంటే అలా ఏం కాదు.

75 అంతకంటే తక్కువ సీటింగ్ సామర్థ్యంతో మల్టీప్లెక్సుల్లో కొన్ని ప్రీమియం స్క్రీన్లు ఉంటాయి. వాటిని ఈ రేట్ క్యాప్ నుంచి మినహాయించారు. వాటి రేటు థియేటర్ల ఇష్టం. ఐతే అలాంటి స్క్రీన్లు మరీ ఎక్కువ ఉండవు. కాబట్టి సామాన్య ప్రేక్షకులపై భారం పడనట్లే. లగ్జరీ కావాలనుకున్న వాళ్లు ఎక్కువ రేట్లు పెట్టి వెళ్తారు. ఈ నిర్ణయం కన్నడ చిత్రాల మీదే కాక వివిధ భాషల సినిమాల మీద ప్రభావం చూపనుంది. బెంగళూరులో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి తెలుగు సినిమాల బిజినెస్‌లో కొంత మార్పులు జరగొచ్చు. రేట్ క్యాప్ పెంచడం వల్ల ఒక్కో టికెట్ మీద వచ్చే ఆదాయం తగ్గినా.. ఆక్యుపెన్సీలు పెరిగి బ్యాలెన్స్ జరుగుతుందనే అభిప్రాయాలున్నాయి.