అరుణాచలం రీల్స్ మీద నిర్మాత కౌంటర్

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి కొంత కాలంగా టైం అట్టే కలిసి రావడం లేదు. ఏది తీసినా యావరేజ్ అనిపించుకోవడమే కష్టమైపోయింది. కొన్ని డిజాస్టర్లను మించిన ఫలితాలు అందించాయి. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా నిర్మాత టిజి విశ్వప్రసాద్ సినిమాలు తీయడం ఆపలేదు. వరస ప్రాజెక్టులను లైన్ లో పెడుతూనే వచ్చారు. రాజా సాబ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీతో మొదలుపెట్టి తెలుసు కదా లాంటి లవ్ ఎంటర్ టైనర్ దాకా పెద్ద లైనప్ ఉంది. భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మిరాయ్ రూపంలో దక్కిన విజయం ఆయన్ని మళ్ళీ రేస్ లో నిలబెట్టింది. బ్లాక్ బస్టర్ ని పళ్లెంలో పెట్టి ఇచ్చింది.

ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ తన మీద వచ్చిన రీల్స్, మీమ్స్ గురించి స్పందించారు. తానేదో అరుణాచలం సినిమాలోలా ఎవరో సంపాదించింది ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతానేలా కొందరు సోషల్ మీడియాలో మీమ్ చేశారని, కానీ అలాంటిదేమి లేదని, చిరుద్యోగిగా జీవితం మొదలుపెట్టి ఇక్కడి దాకా వచ్చిన తనకు డబ్బు విలువ తెలుసంటూ, ఎలా ఖర్చు పెట్టాలి ఎలా రాబట్టుకోవాలనే విషయంలో క్లారిటీతో ఉన్నట్టు అర్థం వచ్చేలా చురకలు వేశారు. నిజమే. ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ ఇండస్ట్రీలో ఎదిగేందుకు కొంత టైం పట్టొచ్చేమో కానీ చివరిగా విజేత నిలవొచ్చు.

విశ్వప్రసాద్ ఇదే రుజువు చేశారు. పరిమిత బడ్జెట్ అయినా సరే బెస్ట్ విఎఫ్ఎక్స్ క్వాలిటీతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఫెయిల్ కాడని గుర్తించి మిరాయ్ అవకాశం ఇచ్చారు. తన బ్యానర్ లోనే ఈగల్ లాంటి ఫ్లాప్ ఇచ్చినా సరే నెరవకుండా అదే నమ్మకాన్ని కొనసాగించారు. అదే ఇప్పుడు ఇంత గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. మిరాయ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. ఆదివారం మొత్తం తన కంట్రోల్ లోనే ఉండబోతోంది. ఒకవేళ వారం పది రోజులు ఇదే జోరు కొనగిస్తే హనుమాన్ ని సులభంగా టేకోవర్ చేస్తుందనే ట్రేడ్ అంచనాలు నిజం కావొచ్చు. క్లారిటీ రావాలంటే ఇంకో మూడు నాలుగు రోజులు ఆగాలి.