దగ్గుబాటి రానా నిర్మాతల్లో ఒకరిగా, దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన సినిమా కాంత ఈ నెల 12 విడుదల కావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యంతో పాటు మిరాయ్, కిష్కిందపురి తదితర పోటీ వల్ల వెనుకడుగు వేసి కొత్త డేట్ కోసం ఎదురు చూస్తోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ పీరియాడిక్ డ్రామాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. టీజర్ వచ్చి వారాలు దాటిపోయింది. ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆశ్చర్యపరచబోతున్నారనే అభిప్రాయం ఆడియన్స్ లో కలిగింది. అయితే కాంతని ఎవరి జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిస్తున్నారో అదే స్టోరీతో ఒక వెబ్ సిరీస్ రూపొందుతోందని ఫిలిం నగర్ టాక్.
కోలీవుడ్ మొదటి సూపర్ స్టార్ గా పేరొందిన వ్యక్తి మయవరం కృష్ణస్వామి త్యాగరాజ భాగవతార్. షార్ట్ కట్ లో ఎంకెటిగా సుప్రసిద్ధులు. 1920లో గాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి తక్కువ కాలంలోనే గొప్ప స్టేజి ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. 1934లో సినీ రంగ ప్రవేశం చేశారు. ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో కేవలం 14 సినిమాల్లో నటిస్తే వాటిలో పది బ్లాక్ బస్టర్లు కావడం ఒక చరిత్ర. హరిదాస్ అనే మూవీ చెన్నైలో ఏకధాటిగా మూడేళ్లు ఆడింది. లక్ష్మీకాంతన్ అనే జర్నలిస్టు మర్డర్ కేసులో ఎంకెటి మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి సాక్ష్యాలు బలంగా లేక బయటికొచ్చారు. 1959లో అనారోగ్యంతో చనిపోయారు.
ఇక్కడ సింపుల్ గా చెప్పుకున్నాం కానీ ఎంకెటి జీవితంలో సినిమాకు ఏ మాత్రం తీసిపోని డ్రామా, మలుపులు ఉన్నాయి. అత్యంత శక్తివంతమైన లెజెండరీగా రాజ్యమేలిన ఒక సూపర్ స్టార్ అంత పతనం ఎలా చూశారనే దాని మీద బోలెడంత రీసెర్చ్ వర్క్ ఉంది. దీని ఆధారంగానే కాంత తీశారనే ప్రచారం చెన్నై వర్గాల్లో బలంగా ఉంది. ఇదే బ్యాక్ డ్రాప్ తో ది మద్రాస్ మిస్టరీ అనే వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది. అంటే సుందరానికి ఫేమ్ నజ్రియా ఇందులో ఒక ప్రధాన పాత్ర పోషించింది. మరి నిజంగా రెండు కథలు ఒకటా లేక వెనుకాల ఇంకేదైనా ట్విస్టు ఉందా అనేది ఇంకొద్ది రోజులు ఆగితే ఆగితే క్లారిటీ రావొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates