మిరాయ్.. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ, అటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా. ముందు ఇదేదో చిన్న సినిమా అనుకున్నారు కానీ.. రిలీజ్ టైంకి ఓ పెద్ద సినిమా రేంజిలో హైప్ తెచ్చుకుంది. ‘హనుమాన్’ తర్వాత మళ్లీ సూపర్ హీరో కథతోనే సినిమా చేసిన తేజ సజ్జ.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తాడనే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కొన్ని విషయాల్లో పరిశ్రమకే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ సినిమా కథలో భారీతనం కనిపిస్తోందిజ విజువల్స్, ఎఫెక్ట్స్ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. అయినా సరే.. వీలైనంత తక్కువ బడ్జెట్లో సినిమాను పూర్తి చేశారు.
అనవసర ఖర్చును తగ్గించుకుని మేకింగ్ మీదే ఎక్కువ డబ్బులు పెట్టారు. అందుకే వందల కోట్లు పెట్టి తీసే సినిమాల స్థాయిలో దీని ఔట్ పుట్ కనిపిస్తోంది. తీరా చూస్తే ఈ సినిమాకు పెట్టిన ఖర్చు దాదాపు రూ.60 కోట్లేనట. పక్కా ప్రణాళికతో, ఒక విజన్తో పని చేయడం వల్లే ఇది సాధ్యమైంది. మరోవైపు సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రేక్షకుల్లో డిమాండ్ ఉంది. అలాంటపుడు టికెట్ల ధరలను ఓ మోస్తరుగా పెంచుకోవడానికి అవకాశముంది.
తెలంగాణలో కష్టం కానీ.. ఏపీలో రేట్లు అడిగితే ఇచ్చేస్తారు. కానీ ‘మిరాయ్’ మేకర్స్ మాత్రం రేట్ల పెంపు వద్దని నిర్ణయించుకున్నారు. నార్మల్ రేట్లతోనే సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. సినిమా బాగుండి, టికెట్ల ధరలు అందుబాటులో ఉంటే జనం ఎంత బాగా థియేటర్లకు వస్తారో మహావతార నరసింహ సినిమా రుజువు చేసింది. ‘లిటిల్ హార్ట్స్’ సైతం ఇలాగే మ్యాజిక్ చేస్తోంది.
ఈ ఎగ్జాంపుల్స్ చూసే ‘మిరాయ్’ టీం ఉన్న రేట్లతోనే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుంది. ఒకవేళ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. ఆక్యుపెన్సీలు భారీగా ఉండి సినిమా పెద్ద రేంజికి వెళ్లడం ఖాయం. ఓవైపు బడ్జెట్ విషయంలో నియంత్రణ పాటిస్తూ ఎంతో కష్టపడి సినిమా తీసిన టీం.. మరోవైపు టికెట్ల ధరల విషయంలోనూ ప్రేక్షకుల కోణంలో ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సినిమాలకు మంచి ఫలితం దక్కితే అదొక సూపర్ ఎగ్జాంపుల్గా నిలిచేందుకు అవకాశముంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates