ఇమేజ్ ఉన్న హీరోలు, కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టిన సినిమాలు సోలో రిలీజ్ కావాలని కోరుకోవడం తప్పు కాదు. అందుకే ముందస్తు ప్లానింగ్ వేసుకుని మరీ డేట్లు ప్రకటించుకుని దానికి అనుగుణంగా ప్రమోషన్లు చేసుకుంటారు. కిష్కిందపురి టీమ్ ఆ పనే చేసింది. సెప్టెంబర్ 12 ఎప్పుడో లాక్ చేసుకుని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. సెప్టెంబర్ 5 ఎలాగూ మిరాయ్ వస్తుంది కాబట్టి వారం గ్యాప్ సరిపోతుందనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసుకుంది. తీరా చూస్తే మిరాయ్ హఠాత్తుగా సెప్టెంబర్ 12కి వచ్చేయడంతో బెల్లకొండ సాయి శ్రీనివాస్, తేజ సజ్జల మధ్య క్లాష్ తప్పడం లేదు. ఓపెనింగ్స్ మీద ఇది ప్రభావం చూపిస్తుంది.
అయితే డేట్ మారాలని నిర్ణయించుకున్నప్పుడు తమకు కర్టసీగా కనీసం చెప్పకుండా ప్రకటన ఇచ్చేశారని మిరాయ్ టీమ్ మీద బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటర్వ్యూలలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. నిజానికా ఆవేదనలో న్యాయముంది. కానీ మిరాయ్ సెప్టెంబర్ 12 వదులుకుంటే చాలా రిస్క్ లో పడుతుందనే వాస్తవాన్ని విస్మరించకూడదు. ఎందుకంటే సెప్టెంబర్ 25 ఓజి దిగుతుంది. పవన్ కళ్యాణ్ పెంచుతున్న హైప్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల థియేటర్లన్నీ దాని నామస్మరణలో మునిగి తేలేలా ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకునే మిరాయ్ బృందం సెప్టెంబర్ 19 కాకుండా సెప్టెంబర్ 12 వేసుకుంది.
న్యాయంగా చూసుకుంటే కిష్కిందపురి వైపే ఎడ్జ్ ఉంటుంది కానీ ఇప్పుడీ పోటీ వల్ల వసూళ్లు ఎఫెక్ట్ కావడాన్ని ఎవరూ కాదనలేరు. హారర్ జానర్ లో రూపొందిన సాయిశ్రీనివాస్ మూవీకి టార్గెట్ ఆడియన్స్ పరిమితంగా ఉంటారు. అందుకే ఒంటరిగా వస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. మిరాయ్ అన్ని వర్గాలను లక్ష్యంగా పెట్టుకొవడంతో పాటు ఫాంటసీ జానర్ కనక ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటుంది. చివరిగా గెలిచేది కంటెంటే కాబట్టి ఫైనల్ విన్నర్ ని తేల్చేది అదే. ఘాటీ, మదరాసిలు నిరాశపరిచి లిటిల్ హార్ట్స్ ఒకటే ఈ వారం విజేతగా నిలవడంతో నెక్స్ట్ వీక్ బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా ఉండబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates