ధనుష్ ధైర్యం చాలా గట్టిది గురూ

సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కాంతారకు ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార చాప్టర్ 1 ది లెజెండ్ మీద ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల నుంచే వంద కోట్ల బిజినెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నిర్మాతలు ఎంత గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. హోంబాలే ఫిలిమ్స్ కావడంతో డిస్ట్రిబ్యూషన్ పరంగా అన్ని రాష్ట్రాల్లో పెద్ద మద్దతు దక్కనుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే కెజిఎఫ్ రికార్డులను దాటేస్తుందనే అంచనాలు బెంగళూరు మీడియాలో బలంగా ఉన్నాయి. అందుకే నేరుగా దీంతో పోటీ పడేందుకు వేరే సినిమాలు సాహసించడం లేదు.

కానీ ధనుష్ అదేమీ పట్టించుకోవడం లేదు. తన కొత్త మూవీ ఇడ్లీ కడాయిని కాంతరకు ఒక రోజు ముందే అంటే అక్టోబర్ 1 రిలీజ్ చేయబోతున్నాడు. దసరా పండక్కు ఎట్టి పరిస్థితుల్లో తన సినిమా ఉండాల్సిందేననే టార్గెట్ తో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసాడు. తమిళనాడు డిప్యూటీ సిఎం ఉదయనిధి స్టాలిన్ అధికారికంగా రెడ్ జాయింట్ ఫిలిమ్స్ సిఈఓగా పదవి స్వీకరించాక ఇడ్లి కడాయి పంపిణీ ఆ సంస్థ ద్వారానే జరుగనుంది. సో తమిళనాడులో ఎలాంటి చిక్కులు ఉండవు. కానీ అంతే కీలకమైన తెలుగు, కన్నడ మార్కెట్లలో కాంతార లెజెండ్ పోటీని తట్టుకోవడం అంత ఈజీగా ఉండదు.

ధనుష్ కి ఇంకో రిస్క్ కూడా ఉంది. దీనికి సరిగ్గా వారం రోజుల ముందు పవన్ కళ్యాణ్ ఓజి వచ్చి థియేటర్లలో ఉంటుంది. దానికి జరిగిన బిజినెస్ కి పెంచిన టికెట్ రేట్లతో కనీసం రెండు వారాలకు పైగా థియేటర్ రన్ దక్కాలి. తర్వాత ధరలు మామూలయ్యాక ఇంకో పదిహేను రోజులు నడవాలి. అంటే ఏపీ తెలంగాణలో ఓజి, కాంతారకు స్క్రీన్లు ఎక్కువగా ఉంటే మిగిలిన వాటితో ధనుష్ సర్దుకోవాలి. నిత్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ ఎమోషనల్ డ్రామాకు తనే స్వీయ దర్శకత్వం వహించాడు. అదే వారంలో అక్టోబర్ 2 మరో బాలీవుడ్ మూవీ సంస్కారికి తులసి కుమారి రేసులో ఉంది. చూడాలి ఎవరు విన్ అవుతారో.