‘మిరాయ్’ నిర్మాతకు ‘కిష్కింధపురి’ ప్రొడ్యూసర్ పంచ్

ఆగస్టులో తగిలిన ఎదురు దెబ్బల తర్వాత సెప్టెంబరు సినిమాల మీద ఆశతో ఉంది టాలీవుడ్ బాక్సాఫీస్. ఈ నెలకు ‘ఓజీ’ సహా కొన్ని క్రేజీ సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. సెప్టెంబరు రెండో వారంలో బాక్సాఫీస్ పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నెల 12న ‘మిరాయ్’ పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కాబోతోంది. అదే రోజు ‘కిష్కింధపురి’ రానుంది. ‘కాంత’ కూడా ఆ వీకెండ్‌కే షెడ్యూల్ అయింది కానీ.. అది వాయిదా పడడం లాంఛనమే అంటున్నారు. తేజ సజ్జ, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల మధ్యే పోరు ఉండొచ్చు.

ఐతే ముందు సెప్టెంబరు 12కు డేట్ ఫిక్స్ చేసుకుంది ‘కిష్కింధపురి’నే. కానీ తర్వాత అదే తేదీకి ‘మిరాయ్’ రిలీజ్ ఖరారు చేసుకుంది. దీంతో తర్వాత ‘కిష్కింధపురి’ని ఒక రోజు లేటుగా మేకర్స్ నిర్ణయించుకున్నారు. కానీ చివ‌రికి 12కే సినిమాను తీసుకురావాల‌ని డిసైడ‌య్యాడు. ఆ ప్ర‌కార‌మే ఈ రోజు ట్రైల‌ర్లోనూ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు.

‘కిష్కింధపురి’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ రిలీజ్ క్లాస్ గురించి చిత్ర నిర్మాత సాహు గార‌పాటికి ప్రశ్న ఎదురైంది. నిర్మాతలందరూ ఒక్కటే అంటారు కదా, ఈ క్లాష్ ఏంటి, ముందు రిలీజ్ డేట్ ప్రకటించిన మీరు ఇబ్బంది ప‌డ‌డం ఏంటి అని అడిగితే.. తన అసంతృప్తిని సాహు బయటపెట్టేశాడు. లేటుగా తమతో పోటీకి వచ్చిన వాళ్లనే దీని గురించి అడగాలని.. ఆయన అన్నాడు.

దీని వల్ల బాధ పడుతోంది మీరు కదా అని అంటే.. నిజంగా ఎవరు బాధ పడతారన్నది సెప్టెంబరు 12న తెలుస్తుందని సాహు అన్నాడు. దీన్ని బట్టి తమ సినిమా కంటెంట్ మీద ఆయన చాలా ధీమాగా ఉన్నారని అర్థమవుతోంది. అంతిమంగా బాక్సాఫీస్ దగ్గర తమ చిత్రమే పైచేయి సాధిస్తుందని.. అప్పుడు ఇబ్బంది పడేది అవతలి వారే అని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. దీనిపై రేప్పొద్దున ‘మిరాయ్’ ప్రమోషన్ల కోసం మీడియా ముందుకు వచ్చినపుడు నిర్మాత విశ్వ ప్రసాద్‌కు ప్రశ్న ఎదురు కాక పోదు. దానికి ఆయనేమంటారో చూడాలి.