తన అనారోగ్యం గురించి చెప్పేసిన రానా

దగ్గుబాటి రానా ఆరోగ్యం గురించి ఎన్నెన్నో ఊహాగానాలు వినిపించాయి ఇప్పటిదాకా. ఆ మధ్య రానా తీవ్ర అనారోగ్యం పాలయ్యాడని.. అతడి కిడ్నీలు రెండూ పని చేయడం మానేశాయని.. అమెరికాలో అత్యవసర చికిత్స అందిస్తున్నారని.. లైఫ్ రిస్క్ అయ్యే పొజిషన్లో ఉన్నాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కొన్ని నెలల పాటు సందిగ్ధత కొనసాగింది.

చాలా బలంగా ఉన్న రానా.. ఆ సమయంలోనే బక్క చిక్కి కనిపించడంతో ఈ సందేహాలు మరింత పెరిగాయి. కానీ కొన్ని నెలల తర్వాత రానా పూర్వపు స్థితికి దగ్గరగా వచ్చాడు. హుషారుగా కనిపించాడు. కొన్ని రోజులకు తన పెళ్లి కబురు కూడా చెప్పాడు. వివాహం కూడా పూర్తయి మళ్లీ షూటింగుల్లో బిజీ అయిపోవడంతో రానా ఇప్పుడు నార్మల్ అనే అనుకుంటున్నారంతా.

ఐతే చిన్నప్పట్నుంచి తాను ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నది రానా.. సమంత ‘ఆహా’ కోసం నిర్వహిస్తున్న ‘సామ్ జామ్’ కార్యక్రమంలో వెల్లడించాడు. ఈ కార్యక్రమం తాజా ఎపిసోడ్‌కు రానాతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ అతిథులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అందులో సగం వరకు చాలా సరదాగా సాగింది. కానీ రెండో సగం చాలా ఉద్వేగభరితంగా నడిచింది. జీవితంలో బాధ కలిగించే వార్తలు వినాల్సి వచ్చినపుడు పరిస్థితి ఏంటి అని సమంత అడిగితే.. తనకు పుట్టినప్పటి నుంచే బీపీ ఉందని, అలాగే తనకు ఒక దశలో రెండు కిడ్నీలూ పాడైన పరిస్థితి వచ్చిందని రానా వెల్లడించాడు.

గుండెపోటు రావడానికి 70 శాతం, ప్రాణం పోవడానికి 30 శాతం ఆస్కారమున్న స్థితిని తాను ఎదుర్కొన్నానని రానా తెలిపాడు. జీవితం ఫాస్ట్ ఫార్వార్డ్‌లో వెళ్లిపోతున్నపుడు ఒక పాజ్ లాంటిది అందరికీ వస్తుందని.. అందుకు తన జీవితమే నిదర్శనం అని రానా చెప్పుకొచ్చాడు. ఐతే క్లిష్ట పరిస్థితుల్లో రానా దృఢంగా నిలబడ్డ తీరు అద్భుతమని, అందుకే అతను తన సూపర్ హీరో అని ఎమోషనల్‌గా వ్యాఖ్యానించింది సామ్. ఆరోగ్య పరంగా తాను ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నది రానా ఈ ప్రోమోలో వెల్లడించలేదు. బహుశా పూర్తి ఎపిసోడ్లో ఆ వివరాలు ఉండొచ్చేమో.