నాగార్జున ఫ్యాన్స్ గ్రహించాల్సింది ఇదే

ఈ రోజు కింగ్ నాగార్జున 66 పడిలో అడుగు పెట్టారు. ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ చార్మ్, చలాకీదనంతో హుషారుగా ఉండే అక్కినేని హీరో గత కొంత కాలంగా ట్రాక్ మార్చి ప్రత్యేక పాత్రల మీద దృష్టి పెట్టడం చూశాం. కూలీలో విలన్ గా కనిపించారు. కుబేరలో మోసాలు చేయడానికి సిద్ధపడే ఆఫీసర్ గా మెప్పించారు. బ్రహ్మాస్త్రలో కీలక మలుపుకు కారణమయ్యే క్యారెక్టర్ లో జీవించారు. అయితే ఈ మూడు సినిమాల్లో నాగ్ పాత్ర చనిపోవడం తెలిసిందే. ఇదే అభిమానుల్లో కొంత అసంతృప్తికి దారి తీస్తోంది. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు లాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్లు తీయాలని కోరుతున్నారు.

ఇక్కడ ఫ్యాన్స్ గమనించాల్సిన విషయాలు కొన్నున్నాయి. మొదటిది ఏఎన్ఆర్ లెగసీని నాలుగు దశాబ్దాలు విజయవంతంగా మోసిన నాగార్జున ఇప్పుడా బాధ్యతను నాగచైతన్య, అఖిల్ పంచుకోవాలని చూస్తున్నారు. నటన పరంగా తాను కొత్తగా ప్రూవ్ చేయాల్సింది ఏమి లేదు కాబట్టి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం ద్వారా కొత్త జనరేషన్ ప్రేక్షకులకు ఇంకాస్త దగ్గరవొచ్చనే ఆలోచన ఆయనది. అమితాబ్ బచ్చన్ లాగా ఆరు పదుల వయసులో చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రాధాన్యం ఉందనిపిస్తే చాలు నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సరిగా వాడటం వాడుకోకపోవడం దర్శకుల చేతుల్లో ఉంటుంది.

నాగ్ సమకాలీకులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఇప్పటికీ సోలోగా మాస్ సినిమాలు చేస్తున్నారు నిజమే. కానీ నాగార్జునకు ప్రయోగాలు చేయడం కొత్త కాదు. శివ తర్వాత ఏడెనిమిది ఫ్లాపులు వచ్చాయి. అవన్నీ టాలీవుడ్ కు పరిచయం లేని డైరెక్టర్లతో చేసిన ఎక్స్ పరిమెంట్లే. అన్నమయ్యలో భక్తుడిగా నటించడం వెనుక ఇమేజ్ పణంగా పెట్టిన పెద్ద సాహసం ఉంది. అయినా తీసుకున్నారు. జీవితాంతం చెప్పుకునే గొప్ప సినిమా మిగిలింది. అలా ప్రతిసారి జరుగుతుందనే గ్యారెంటీ లేకపోయినా నిత్యం రిస్కులు తీసుకుంటూనే ఉండాలి. తన వందో సినిమాగా దర్శకుడు ఆర్ కార్తీక్ తో చేయబోయే మూవీ లాంచ్ త్వరలోనే జరగనుంది.