కొందరు దర్శకులకు కొన్ని బేనర్లతో బాగా సింక్ కుదురుతుంది. గత చిత్రాల ప్రొడక్షన్ విషయంలో ఇబ్బందులు తలెత్తి ఉండొచ్చు లేదంటే కొత్త నిర్మాతలతో కంఫర్ట్ ఉండొచ్చు. కారణమేదైనా వరుసగా ఒక బేనర్లో సినిమాలు చేస్తుంటారు. నిర్మాణ సంస్థలు కూడా తమకంటూ ఆస్థాన దర్శకులు ఉండాలని కోరుకుంటాయి. దిల్ రాజు బేనర్లో ఇలా వరుసగా సినిమాలు చేసిన దర్శకులు చాలామందే ఉన్నారు. హారిక హాసిని సంస్థ ఎన్నో ఏళ్ల నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్తోనే సినిమాలు తీస్తోంది. త్రివిక్రమ్ కూడా బయటి బేనర్లకు సినిమాలే చేయట్లేదు.
ఈ కోవలోనే శేఖర్ కమ్ముల కూడా ఒక సంస్థతో ట్రావెల్ చేస్తున్నాడు. అదే.. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పీ. ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు కలిసి నడిపిస్తున్న సంస్థ. ఈ బేనర్లో కమ్ముల ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. తొలిసారి ఆ బేనర్లో చేసిన ‘లవ్ స్టోరి’ ఓ మోస్తరు ఫలితాన్నందుకోగా.. రెండో చిత్రం ‘కుబేర’ తెలుగు వరకు మంచి విజయాన్నే అందుకుంది. దీంతో మరోసారి ఈ నిర్మాణ సంస్థలో కమ్ముల సినిమా చేయబోతున్నాడు.
వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకుని కమ్ములతో తమ బేనర్లో మరో సినిమా చేయబోతున్న విషయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. ఐతే ఇంతకుమించి సినిమా గురించి వివరాలేమీ వెల్లడించలేదు. ఈ ప్రాజెక్టు ఆరంభ దశలోనే ఉందని, కాస్ట్ అండ్ క్రూ గురించి తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. కమ్ముల స్క్రిప్టు రెడీ చేయడానికి, ప్రి ప్రొడక్షన్కు చాలా టైం తీసుకుంటాడు. కాబట్టి వచ్చే ఏడాదే ఈ సినిమా మొదలయ్యే అవకాశముంది. ఈసారి తన మార్కు ప్రేమకథా చిత్రం తీస్తానని ‘కుబేర’ ప్రమోషన్ల టైంలో కమ్ముల వెల్లడించిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates