తేజ సజ్జ రొట్టె విరిగి నేతిలో పడేలా ఉంది. సెప్టెంబర్ 12 విడుదల కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ కోసం ఇతర రాష్ట్రాల్లో బడా సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. హిందీ వెర్షన్ ధర్మ ప్రొడక్షన్స్ తరఫున కరణ్ జోహార్ తీసుకోగా, కర్ణాటకలో కెజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ రంగంలోకి దిగింది. తమిళనాడులో ఏజిఎస్ సినిమాస్ ముందుకు వచ్చిందంటే థియేటర్ల పరంగా వచ్చే అతి పెద్ద సమస్య తీరినట్టే. మలయాళంలో గోకులం అండదండలు దొరకడమంటే మాములు విషయం కాదు. తెలుగు రాష్ట్రాల పంపిణీదారులు ఇంకో రెండు మూడు రోజుల్లో ఫైనల్ కాబోతున్నారు. మొత్తానికి ప్యాన్ ఇండియా స్కెచ్ పెద్దగానే ఉంది.
హనుమాన్ తర్వాత తేజ సజ్జ మిరాయ్ కోసమే రెండేళ్లు ఖర్చు పెట్టుకున్నాడు. మధ్యలో చాలా ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదు. మార్కెట్ ని పెంచుకునే లక్ష్యంతో వయసుకి మించి కష్టపడ్డాడు. బజ్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ డ్రామాలో బలమైన డివోషనల్ ఎలిమెంట్ ఉందట. టీజర్ లో శ్రీరాముడు ఉండొచ్చనే హింట్ ఇచ్చారు కాబట్టి ఆ కోణం కనక సరిగ్గా వర్కౌట్ అయితే ఉత్తరాది ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. నిఖిల్ కార్తికేయ 2 అంత బ్లాక్ బస్టర్ కావడానికి కారణం ఇదే. మిరాయ్ లోనూ అలాంటి అంశాలు పుష్కలంగా ఉన్నాయట.
మిరాయ్ కి తొలి రెండు వారాలు కీలకం కాబోతున్నాయి. సెప్టెంబర్ 25 ఓజి వస్తుంది కాబట్టి ఆలోగానే తెలుగు రాష్ట్రాల్లో వీలైనంత రాబట్టుకోవాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పారుతున్న నేపథ్యంలో ఏపీ తెలంగాణలో ఓజికి అతి పెద్ద రిలీజ్ దక్కనుంది. ఒకవేళ మిరాయ్ కనక హనుమాన్ రేంజ్ టాక్ తెచ్చుకుంటే మూడో వారంలోనూ కొనసాగే ఛాన్స్ ఉంటుంది. సెప్టెంబర్ 12 రావాల్సిన దుల్కర్ సల్మాన్ తప్పుకోవడం మిరాయ్ కి కలిసి వచ్చే అంశమే. అదే రోజు విజయ్ ఆంటోనీ భద్రకాళి ఉంది కానీ దాన్ని మరీ పెద్ద కాంపిటీషన్ గా భావించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. రేపు ట్రైలర్ తో అంచనాల లెక్కలు మారబోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates