సర్కారు వారి పాట.. ఇప్పుడే కాదు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘సర్కారు వారి పాట’ పేరుతో కొత్త సినిమా కొన్ని నెలల కిందటే అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా చిన్న, మీడియం రేంజ్ సినిమాలకే పరిమితం అయిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.

సినిమా ఖరారై చాన్నాళ్లయినా.. ప్రారంభోత్సవానికి బాగా టైం పట్టేసింది. ఈ శనివారమే ముహూర్త కార్యక్రమం నిర్వహించారు. హీరోతో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ వేడుకలో పాల్గొనలేదు. మహేష్ భార్య నమ్రత, కూతురు సితార కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపించడం విశేషం. దర్శక నిర్మాతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సర్కారు వారి పేట’ కీ టెక్నీషియన్ల వివరాలు వెల్లడించారు. అలాగే సినిమా షూటింగ్ కూడా గురించి కూడా అప్ డేట్ ఇచ్చారు.

ముందు అనుకున్నట్లే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నాడు. మహేష్ బాబును ‘శ్రీమంతుడు’ సినిమాలో చాలా బాగా చూపించాడని పేరు తెచ్చుకున్న స్టార్ సినిమాటోగ్రాఫర్ మది ఈ చిత్రానికి పని చేయబోతున్నాడు. ఎస్.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ కాగా.. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటర్. రామ్ లక్ష్మణ్ స్టంట్స్ కంపోజ్ చేయనున్నారు. ఇక ‘సర్కారు వారి పేట’ షూటింగ్ ముందు అనుకున్నట్లు ఇంకొన్ని రోజుల్లో ఏమీ మొదలు కావట్లేదు. జనవరిలో చిత్రీకరణ మొదలుపెడతామని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే మహేష్ చాలా ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడని.. ఇంకొన్ని రోజుల్లోనే ఈ సినిమాను మొదలుపెట్టేస్తాడని అన్నారు. ఇటీవలే కుటుంబంతో వెకేషన్ కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇక ఆలస్యం చేయడని అనుకున్నారు. కానీ మహేష్ ఇంకో నెలన్నర పైగానే విరామం తీసుకోబోతున్నాడని స్పష్టమవుతోంది. మరి కరోనాకు భయపడుతున్నాడా.. ఇంకేదైనా ఆలస్యానికి కారణముందా అన్నది తెలియదు.