యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న స్పై యునివర్స్ కి వార్ 2 పెద్ద దెబ్బ కొట్టింది. ఇప్పటిదాకా ఈ సిరీస్ లో వచ్చిన వాటిలో టైగర్ 3 వీక్ అనుకుంటే ఇప్పుడు దాని రికార్డుని ఈ మల్టీ స్టారర్ దాటేయడం నిర్మాత ఆదిత్య చోప్రాని మరింత కలవర పెడుతోంది. ఏదో జస్ట్ ఫ్లాప్ అయ్యుంటే ఏమో కానీ ఇద్దరు స్టార్లను పెట్టుకుని, వందల కోట్ల బడ్జెట్ ఖర్చు పెడితే, నష్టాలతో పాటు విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. ట్రోలింగ్ కూడా గట్టిగానే జరిగింది. స్వయానా వీటికి కథకుడైన ఆదిత్య చోప్రా తప్పు ఎక్కడ జరుగుతోందో సీరియస్ గా విశ్లేషించుకునే పనిలో పడ్డారని ముంబై టాక్.
ఇప్పుడీ స్పై యునివర్స్ నుంచి మరో మూవీ ‘అల్ఫా’ డిసెంబర్ 25 విడుదలకు రెడీ అవుతోంది. వార్ 2 ఎండ్ టైటిల్స్ అయ్యాక చూపించిన బాబీ డియోల్ సీన్ దీన్నుంచి తీసుకున్నదే. అయితే ఇప్పుడు దీనికి శల్య పరీక్ష జరుగుతోందట. శివ్ రవైల్ దర్శకత్వం వహించిన ఆల్ఫాలో టైటిల్ రోల్ అలియా భట్ పోషించగా మరో ముఖ్యమైన పాత్రను శార్వరి వాఘ్ చేసింది. ఈ ఇద్దరు చేసే సాహసాలు ఇందులో కీలకం కాబోతున్నాయి. ఇప్పటిదాకా జరిగిన షూటింగ్ కు సంబంధించిన ఫుటేజ్ ని రివ్యూ చేయడంతో బ్యాలన్స్ ఉన్న భాగానికి స్క్రిప్ట్ రిపేర్లు కూడా చేస్తున్నారట. ఒకవేళ అవసరమైతే కొన్ని ఎపిసోడ్స్ రీ షూట్ కూడా చేస్తారట.
స్పై యునివర్స్ ని హాలీవుడ్ అవెంజర్స్ తరహాలో డెవలప్ చేద్దామని కలలు కన్న ఆదిత్య చోప్రాకు టైగర్ 3, వార్ 2 ఇచ్చిన షాకులు మళ్ళీ ఆల్ఫా నుంచి రాకూడదనే ఉద్దేశంతో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. అయినా కోట్లు పెడుతున్నాం కదాని ఒకే కథని తిప్పి తిప్పి చూపిస్తే ఆడియన్స్ తిరస్కరించక ఏం చేస్తారు. ఇద్దరు స్నేహితులు, వాళ్ళలో ఒకడు దేశద్రోహిగా మారి హీరోకి ఛాలెంజ్ విసరడం, ఇలా ఒకే టెంప్లేట్ లోనే రాసుకుంటున్న ఆదిత్య చోప్రా ముందుగా ఈ స్టైల్ ని మార్చుకోవాలి. ఈ పరిణామాల వల్లే టైగర్ వర్సెస్ పఠాన్, జవాన్ 2 ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లకపోవచ్చని ముంబై న్యూస్.
Gulte Telugu Telugu Political and Movie News Updates