ధూమ్ ధూపానికి దూరమే మంచిది

వార్ 2 పోయాక ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో ధూమ్ 4 మీద రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. దొంగతనాల మీద వచ్చిన సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ గా ధూమ్ గురించి ప్రేక్షకుల్లో మాములు క్రేజ్ లేదు. ముఖ్యంగా ఈ సిరీస్ లో మొదటి భాగం ప్రేక్షకుల ముందుకొచ్చినప్పుడు ఆ టేకింగ్, మేకింగ్ కి ఆడియన్స్ షాక్ అయ్యారు. జాన్ అబ్రహం విలనీ, అభిషేక్ బచ్చన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర, ట్విస్టులు ఛేజులు అబ్బో ఓ హాలీవుడ్ మూవీ చూసిన రేంజ్ లో ఫీలయ్యారు. ధూమ్ 2లో హృతిక్ రోషన్ వచ్చి చేరాక దీనికి మరింత డిమాండ్ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బెనిఫిట్ షోలు వేసేంత రేంజ్ లో హైప్ నడవడం అతిశయోక్తి కాదు.

ధూమ్ 3కి మాత్రం షాక్ కొట్టింది. అమీర్ ఖాన్ డ్యూయల్ రోల్ చేసినా అంతగా మెప్పించలేక యావరేజయ్యింది. వసూళ్లు వచ్చాయి కానీ కామన్ పబ్లిక్ నుంచి యునానిమస్ టాక్ తెచ్చుకోలేకపోయింది. అందుకే యష్ రాజ్ ఫిలిమ్స్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. కట్ చేస్తే ఇప్పుడు ధూమ్ 4కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రన్బీర్ కపూర్ దొంగగా నటించేందుకు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వార్ 2 తీసిన అయాన్ ముఖర్జీకే ఈ బాధ్యతలు అప్పజెప్పాలని నిర్మాత ఆదిత్య చోప్రా అనుకున్నాడు. కాకపోతే ఈసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అభిషేక్ బదులు ఎవరైనా సౌత్ స్టార్ ని తీసుకునే ఆలోచన చేశారని ముంబై టాక్.

ఇప్పుడా అవకాశాలు సన్నగిల్లాయని చెప్పొచ్చు. ఎందుకంటే వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చూశాక మనోళ్లు ఎవరూ ఆ రిస్క్ చేయరు. ధూమ్ ప్రాధమికంగా దొంగ చుట్టూ నడిచే కథ. పేరుకి సెకండ్ హీరో పోలీస్ గా కనిపించినా అది డమ్మీగానే ఉంటుంది. అలాంటప్పుడు చేయకపోవడమే మంచిది. అభిషేక్ బచ్చన్ లాంటి వాళ్లే సూటవుతారు. ఇప్పుడు వార్ 2 ఫలితం తెలిశాక అనవసరంగా రిస్క్ చేసేందుకు టాలీవుడ్ స్టార్లు సిద్దపడరు. రామాయణ, లవ్ అండ్ వార్ లో బిజీగా ఉన్న రన్బీర్ కపూర్ డేట్లు ఇంకో ఏడాది దాకా దొరికేలా లేవు. ఆ తర్వాతే ధూమ్ 4 మొదలవుతుంది. ఆలోగా ఇంకేం ట్విస్టులు జరుగుతాయో చూద్దాం.