అక్కినేని నాగార్జున తన కుటుంబం విషయంలో ఎంత బాధ్యతతో ఉంటాడో అందరికీ తెలిసిందే. తన కొడుకులతో పాటు అక్కినేని ఫ్యామిలీలో అందరినీ చాలా బాగా చూసుకుంటాడని ఆయనకు పేరుంది. తన మేనల్లుడు సుమంత్, మేనకోడలు సుప్రియ.. అలాగే అక్క నాగసుశీల కుటుంబం విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా భర్తను కోల్పోయిన నాగసుశీలకు నాగ్ ఎంత అండగా నిలుస్తున్నాడనే విషయం జగపతిబాబు నిర్వహిస్తున్న ఒక టీవీ షోలో వెల్లడైంది.
నాగసుశీలతో పాటు అన్నయ్య వెంకట్లతో కలిసి ఈ షోలో పాల్గొన్న సందర్భంగా నాగ్ తమ కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా ఉంటాడో నాగసుశీల స్వయంగా వెల్లడించారు. ఆ ఎమోషనల్ మూమెంట్ షో చూసేవాళ్లందరి కళ్లల్లో నీళ్లు తెప్పించింది. నాగసుశీల భర్త, సుశాంత్ తండ్రి సత్యభూషణరావు చాలా ఏళ్ల కిందటే చనిపోయారు. దీర్ఘ కాలిక అనారోగ్యంతో ఆయన కన్ను మూశారు. ఐతే ఆయన మంచంపట్టి పూర్తిగా కదలికలు ఆగిపోయాక డాక్టర్లు ఇక ప్రాణం నిలవడం కష్టమని తేల్చేశారట. ఐతే ఇక పూర్తిగా ఆశలు కోల్పోయాక కూడా సత్యభూషణ్ ప్రాణం పోలేదట.
ఆ సమయంలో నాగార్జున తన అక్క దగ్గరికి వచ్చి.. ఆయన ఇంకా ఎందుకు ప్రాణం ఆపుకుంటున్నారు.. ఆయనకు ఏదైనా అసంతృప్తి ఉందా.. దేని గురించైనా ఆందోళన చెందుతున్నారా అని అడిగాడట. ఆ తర్వాత తన బావ దగ్గరికి వెళ్లి.. ‘‘అక్కకు, సుశాంత్కు నేనున్నాను. వాళ్ల బాధ్యత నాది. వాళ్లని కంటికి రెప్పలా కాపాడుకుంటాను’’ అని ఆయన చేయి పట్టుకుని భరోసా ఇచ్చాడట నాగ్. ఆ సమయంలో తన భర్తలో కదలికలు ఆగిపోయినా, ఎదుటి వాళ్లు చెప్పేది విని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడని.. నాగ్ ఈ మాట చెప్పాక ఆయనకు ఒక భరోసా వచ్చి, తర్వాతి రోజే తుది శ్వాస విడిచాడని నాగసుశీల ఎంతో భావోద్వేగంతో చెప్పారు. ఈ మాటలు చెబుతున్నపుడు నాగార్జున కళ్లలో నీళ్లు తిరిగాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates